తాజాగా ఇటీవల శ్రీరెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై అలాగే మీడియా ప్రతినిధులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కేంద్రంగా తనను చంపడానికి తన వ్యక్తిగత జీవితంపై కూడా బురద జలడానికి మంత్రి నారా లోకేష్ ఇతరులతో మంతనాలు జరుపుతున్నారని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన నారా లోకేష్.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది.
లోకేష్ మాట్లాడుతూ..జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ మంచివారేనని, అతనిపై తనకు మంచి అభిప్రాయం ఉందని అన్నారు. ఆయనను ఎవరో తప్పుతోవ పట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తనపై ఆయన అవినీతి ఆరోపణలు చేసిన తరువాత ట్విట్టర్లో తాను స్పందించిన సంగతిని గుర్తుచేశారు.
ప్రతిపక్షంలో నాలుగేళ్లు, అధికారంలో నాలుగేళ్లు వరుసగా ఎనిమిదేళ్లు తమ కుటుంబానికి చెందిన ఆస్తుల లెక్కలను బహిరంగం చేస్తూ పారదర్శకంగా రాజకీయాలు చేస్తున్నామని అన్నారు. తాము చూపించిన లెక్కల కన్నా ఒక్క పైసా ఎక్కువ ఉన్నా ప్రశ్నించవచ్చునన్నారు. శ్రీరెడ్డి వ్యవహారంలో తన పాత్ర ఉందని ఆరోపణలు రావడం బాధాకరమని మంత్రి లోకేశ్ అన్నారు.