ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని..మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా శనివారం సాయంతం ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాచేపల్లిలో జరిగిన దారుణమైన ఘటన చూస్తే సమాజంలో మహిళలు తిరిగే పరిస్థితి లేకుండా ఉందని..అసలు ఏపీలో లా అండ్ ఆర్డర్ నడుస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని సుబ్బారెడ్డి అన్నారు.
భారత దేశంలో కొంత కాలంగా మహిళలపై దారుణ అకృత్యాలు జరుగుతున్నాయని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా..ప్రతిరోజూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా శనివారం 13 జిల్లాల్లో రేపు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామని వివరించారు. ఈ నెల 14న వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఏలూరు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందని చెప్పారు.
ఈ నెల 14, 15 తేదీల్లో నల్లజెండాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 16న కలెక్టరేట్ల వద్ద వంచనపై గర్జన పేరుతో ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్న టీడీపీ ఓ వైపు కేంద్రాన్ని విమర్శిస్తూనే..బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేస్తుందని అన్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో చంద్రబాబు ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పరిశ్రమల పేరిట లక్షలమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తాండవం అడుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలనూ సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు.