సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలతో వైసీపీ బలోపేతం అవుతోంది. పాదయాత్రలో వస్తున్న ప్రజాదరనను చూసి ముఖ్యనేతలు జగన్వైపు చూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది పార్టీ కండువా కప్పునున్నారు. తాజాగా సీనియర్ నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అనుచరులు పూర్తి చేశారు. ఈ ఉదయం వైఎస్ జగన్ ను స్వయంగా కలిసే వసంత, ఆపై వైకాపా జండాను కప్పుకోనున్నారు.
కాగా, టీడీపీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని గత కొంతకాలంగా కినుక వహించిన కృష్ణప్రసాద్ చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 1999లో నందిగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన గుంటూరు-2 స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో టికెట్ లభించలేదు.
తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం ప్రాంతాల నుంచి భారీగా వసంత అభిమానులు ఈ ర్యాలీలో జతకానుండగా, ప్రస్తుతం కైకలూరు సమీపంలో పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు ర్యాలీ వెళుతుంది.
ఆపై కృష్ణ ప్రసాద్ ను పార్టీలోకి ఆహ్వానించే జగన్, ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక పార్టీలో చేరకముందే ఆయనకు టికెట్ ఖరారైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మైలవరం అసెంబ్లీ, లేదంటే విజయవాడ నుంచి ఆయనను లోక్సభ బరిలో దింపాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.