విపరీతమని రాజకీయ అలసత్వం ప్రతి దాంట్లో రాజకీయ ప్రయోజనాలు ఆశించటం వ్యక్తి పుజ జాతికి ఎనలేని కీడు చేస్తున్నాయి. శాసనసభలకు పరిమితవ్వ వలసిన వాళ్ళు ఎక్జెక్యూటివ్ కార్యక్రమాల్లో తల దూర్చటం దేశ ప్రయోజనాలను బుగ్గి చేస్తున్నాయి. ప్రజల ఆకంక్షలను నెఱవేర్చాల్సిన ప్రజలనే వారి వ్యక్తిగత స్వార్ధం కోసం బలి చేయటం స్వాతంత్ర భారతం పుట్టిన నాటి నుండి పుట్టి దేశం వయసుతో పాటు పెరుగుతూ ప్రజల నెత్తిన గుదిబండలా తయారైంది. చివరకు బిజెపి కూడా అలాగే తగలడింది.
భారత దేశ రాజధాని ఢిల్లీకి ట్రాఫిక్ సమస్యల నుంచి స్వల్ప ఊరట కల్పించే ప్రతిష్టాత్మక ఎక్స్ప్రెస్ వే ప్రారంభం విషయంలో జరుగుతున్న జాప్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రహదారి ప్రారంభించటానికి ప్రధాని నేంద్ర మోడీకి సమయం దొరకని కారణంగా పిబ్రవరిలో పూర్తైన రహదారి ప్రోజెక్ట్ ప్రజల వినియోగానికి రాకపోవటం ఎంత దురదృష్టం ఈ దేశంలో. ఒక వ్యక్తి కోసం కోట్లాది ప్రయోజనాలను బలి చేయటం ఏమంత న్యాయం.
ఆ రహదారిని ప్రారంభించడానికి ప్రధాని మోదీకి సమయం లేకపోతే మీరే ఆ పని మీరే పూర్తి చేయండంటూ “నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-ఎన్హెచ్ఏఐ” ను భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్, ఫరీదాబాద్ పట్టణాలను గ్రేటర్ నోయిడాతో కలిపే “ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే” ను మే 31లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.
80శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న ఈ ఎక్స్ప్రెస్ వేను గత ఏప్రిల్లోనే ప్రారంభించ వలసి ఉండగా కార్యరూపం దాల్చలేదు. ఏప్రిల్ 29న ప్రారంభానికి ముహుర్తం ఖరారు చేసిన ప్పటికీ ప్రధాని నరెంద్ర మోదీ ‘బిజీ షెడ్యూల్’ కారణంగా దాన్ని వాయిదా వేశారు. ప్రధాని మోదీ గత కొద్ది రోజులుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
యూపీలోని పలు ప్రధాన పట్టణాలను దేశ రాజధాని ఢిల్లీతో అనుసంధానం చేసే ఈ రహదారి పొడవు 135కి.మీ. ఎలాంటి ‘స్టాపింగ్ సిగ్నళ్లు’ లేకుండా అత్యంత ఆధునిక సదుపాయాలతో ఈ ఎక్స్ప్రెస్ వే ను నిర్మించారు. ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై దృష్టి కేంద్రీకరించాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించి హెచ్చరించిన నేపథ్యంలో నగరం చుట్టూ రింగు రోడ్ల నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.
2016 జూన్ నాటికి ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. కానీ, నిర్మాణంలో జాప్యం వల్ల 2018 ఫిబ్రవరి నాటికి ప్రధాన పనులు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇది ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానికి తీరిక లేకపోవడం వల్లే ఈ జాప్యం జరిగిందని ఎన్హెచ్ఏఐ తరఫు న్యాయవాదులు సమాధానం ఇవ్వగా సుప్రీంకోర్టు మండిపడింది. ఆయనకు కుదరకపోతే మే 31లోగా మీరే దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురండని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. గతంలో వీఐపీల వాహనాలకు ఎర్ర బుగ్గల వాడకం పైనా సుప్రీం కోర్టు వెలువరించిన నిర్ణయం రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలికిన విషయం తెలిసిందే.