ముందునుండి అందరూ ఊహించినట్లే కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామి ఆధ్వర్యంలోని జెడిఎస్ కీలకపాత్ర పోషించనున్నట్లే కనబడుతోంది. సుమారు 45 నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి అభ్యర్ధులను కాదని జెడిఎస్ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉండటం గమనార్హం. సొంతంగా అధికారంలోకి రావటానికి 224 నియోజకవర్గాలున్న కర్నాటకలో ఏ పార్టీకైనా 122 సీట్లు రావాలి.
కాకపోతే ఇపుడు ఎన్నికలు జరిగింది 222 సీట్లకే. ఆ దామాషాలోనే సింపుల్ మెజారిటీ కూడా 120 సీట్లే. ఆధిక్యతల సరళిని చూస్తుంటే మ్యాజిక్ ఫిగరైన 120 సీట్లు కూడా ఏ పార్టీ కూడా సాధిస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకనే మూడో స్ధానంలో ఉంటుందనుకుంటున్న జెడిఎస్సే కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు జరిగిన 222 స్ధానాలకు గాను 221 నియోజకవర్గాల్లో ఆధిక్యతలు వచ్చేశాయి.
అంచనాలను మించిన జెడిఎస్
ఆధికత్యల పరంగా బిజెపి 105 సీట్లలో మెజారిటి సాధించినా ఎంత వరకూ ఆధిక్యతను నిలుపుకుంటుందో చూడాల్సిందే. అందుకనే ప్రధానపార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు అప్పుడే జెడిఎస్ అధినేత కుమారస్వామిని ప్రశన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎందుకంటే, జెడిఎస్ అభ్యర్ధుల ఆధిక్యతలు కూడా పెరుగుతున్నాయి. అందులోనూ జెడిఎస్ అధినేత రామనగర నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యత సాధించటంతో జెడిఎస్ లో ఉత్సాహం పొంగిపొరలుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమైతే జెడిఎస్ సుమారు 40 స్ధానాల్లో గెలుస్తుందన్న అంచనాలున్నాయి. అయితే, ఆధిక్యతల సరళిని బట్టి చూస్తుంటే జెడిఎస్ 50 స్ధానాలను దాటే అవకాశాలు కనబడుతున్నాయి.
జెడిఎస్ షరతులు
అందరూ ఊహించినట్లే కర్నాటకలో ఆధిక్యతల సరళిని గమనిస్తుంటే హంగ్ వచ్చేట్లు కనబడుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో జెడిఎస్ కీలక పాత్ర పోషించనున్న విషయం అర్ధమైపోతోంది. దాంతో ఇటు కాంగ్రెస్, అటు బిజెపిల కీలక నేతలు జెడిఎస్ తో మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. కాకపోతే కాంగ్రెస్, బిజెపిల తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా ప్రచారంలో ఉన్న శిద్ధరామయ్య, యడ్యూరప్పలకు మద్దతిచ్చే ప్రశ్నే లేదని ఇప్పటికే కుమారస్వామి స్పష్టం చేయటంతో ఆయా పార్టీల్లో ఆశావహులు కూడా పెరిగిపోతున్నారు. ఆధిక్యతలు రౌండు రౌండుకు మారిపోతుండటంతో అంతిమ ఫలితాలు వెలువడేందుకు బాగా టైం పట్టేట్లే కనబడుతోంది.
కాంగ్రెస్ వీకవ్వటంతోనే పుంజుకున్న జెడిఎస్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు వీకవ్వటంతోనే పలు చోట్ల జెడిఎస్ అభ్యర్ధులు పుంజుకున్నట్లు కనబడుతోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రయోగించిన లింగాయత్ అస్త్రం కూడా పెద్దగా పనిచేసినట్లు కనబడలేద. లింగాయత్ లను బిసిల్లోకి చేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి శిద్దరామయ్య ప్రకటించటంతో ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు తప్పవని అందరూ అంచనాలు వేశారు. అయితే, అటువంటిదేమీ కనబడలేదు. దాంతోనే జెడిఎస్ పుంజుకున్నది.