ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు గురించి హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రజలు ఎంతో భక్త శ్రద్దలతో పూజించే భగవంతుడి విషయాల్లో కూడా రాజకీయాలు దారుణంగా రాజ్యమేలుతున్నాయి. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని దేవాలయాల్లో మీరాశీ వ్యవస్థ రద్దవడంతో టిటిడిలోనూ మిరాశీకి మంగళం పాడారు. కాకపోతే అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మిరాశీ పద్ధతిలో అర్చకత్వం బాధ్యతల్లో ఉన్నవారికి ఉపాధి చూపించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.
ఈ మేరకు నాలుగు ప్రధాన అర్చక, 4 ముఖ్య అర్చక, 43 అర్చక పోస్టులను సృష్టించింది. ఈ పోస్టుల్లో అప్పటిదాకా మిరాశీ వ్యవస్థలో పని చేస్తున్న కుటుంబాల వారిని నియమించమని సూచించింది. 1. పెద్దింటి, 2.పైడిపల్లి, 3. గొల్లపల్లి, 4. తిరుపతమ్మ కుటుంబాలు మిరాశీలో ఉండేవి. ఈ నాలుగు కుటుంబాల నుంచే ప్రధాన అర్చక, ముఖ్య అర్చక, అర్చక పోస్టుల భర్తీ కోసం టిటిడి కసరత్తు చేసింది. కాగా ఈ నాలుగు కుటుంబాల వివరాలు పూర్తిగా సేకరించి ఏ ఏ పోస్టుకు ఎవరు అర్హులో గురించి ఆయా పోస్టుల్లో నియమించింది.
కాగా, ఇందులో గొల్లపల్లి కుటుంబం నుంచి వచ్చిన రమణ దీక్షితులు ప్రధాన అర్చకులు అయ్యారు. మొదట గొల్లపల్లి కుటుంబంలో ఎ.వెంకటరమణ దీక్షితులు, ఎ.సుందరరామ దీక్షితులను టిటిడి గుర్తించింది. ఈ విషయంపై తర్జన భర్జన జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే సమయానికి ఈ ఇద్దరు జీవించి లేరు. అయితే…ఎ.వెంకటరమణ దీక్షితులు ఎవి రమణ దీక్షితులను తన కుమారుడిగా దత్తత తీసుకున్నారు. అంటే రమణ దీక్షితులు… వెంకటరమణ దీక్షితులు దత్తపుడ్రన్నమాట. ఇక సుందరరామ దీక్షితులకు పాపన్న దీక్షితులు, రామచంద్ర దీక్షితులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పాపన్న దీక్షితులు ఈ నియామకాలు జరిగడానికి రెండేళ్ల ముందే మరణించారు.
పాపన్న దీక్షితులుకు ఎఎస్. సుందరరామ దీక్షితులు, ఎఎస్. క్రిష్ణమూర్తి దీక్షితులు, ఎఎస్. వెంకటకుమార్ దీక్షితులు అనే ముగ్గురు కుమారులున్నారు. పాపన్న దీక్షితులు లేకపోవడం వల్ల ఈ ముగ్గురూ అర్చక పోస్టులకు సరిపడా విద్యార్హతలే ఉండటం వల్ల అర్చక పోస్ట్లుల్లో నియమించారు. ఆ విధంగా వీరికి ప్రధాన అర్చక పోస్టు తప్పిపోయింది. ఇక ఎ.సుందరరామ దీక్షితులు రెండో కొడుకైన ఎ.రామచంద్ర దీక్షితులు విషయానికి వస్తే..ఆయనకు అంగవైకల్యం అందుచేత ఆయన అర్చకత్వానికి అర్హులు కాలేక పోయారు.
సుందరరామ దీక్షితులుకు ఎ.వేణుగోపాల దీక్షితులు, ఎ.గోపినాథ్ దీక్షితులు, ఎ.రామకృష్ణ దీక్షితులు అనే ముగ్గురు కుమారులున్నారు. అప్పటికే ఈ ముగ్గురూ తిరుమల శ్రీవారి ఆలయంలో పని చేస్తున్నారు.గొల్లపల్లి వంశంలో మొదటి తరంలో గుర్తించబడిన ఇద్దరిలో (ఎ.వెంకటరమణ దీక్షితులు, ఎ.సుందరరామ దీక్షితులు) వెంకటరమణ దీక్షితులు దత్త పుత్రుడైన ఎవి రమణ దీక్షితులుకు ప్రధాన అర్చకునిగా నియమించడానికి అవసరమైన అర్హతలు ఉండటంతో ఆయన్ను ఎంపిక చేశారు. తాజాగా రమణ దీక్షితులు స్థానంలో అంటే గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులను టిటిడి ఎంపిక చేసింది.