నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఫిరాయింపు మంత్రి ఆది నారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే కాకుండా జిల్లాలో కూడా సంచలనంగా మారింది. జిల్లాలోని జమ్మలమడుగులో జరిగిన మినీమహానాడులో మంత్రి మాట్లాడుతూ, సిఎం రమేష్ ప్రతీ పనికి అడ్డొస్తే కాల్చేసే రోజులొస్తాయంటూ తీవ్రంగా వేదికపై నుండే హెచ్చరించారు. మంత్రి-సిఎం రమేష్ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే. కుందు వరదకాల్వ పనుల కాంట్రాక్టును దక్కించుకున్న రమేష్ కంపెనీపై ఈ మధ్యనే ఆది మద్దతుదారులు దాడి చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఇద్దరి మధ్య గొడవలు తగ్గాల్సింది పోయి రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో జిల్లాలోని ఇతర నేతలకు ఇబ్బందిగా మారింది.
ఎదుటివారిని కాల్చేస్తా
రాజ్యసభ సభ్యుని గురించి మాట్లాడుతూ, తాను గన్ లాంటి వాడినని కార్యకర్తలు బుల్లెట్లు అందిస్తే ఎదుటివారిని కాల్చేయటమే తన పనిగా మంత్రి చెప్పారు. మార్కెట్ యార్డులో కూపన్లను అమ్ముకుంటున్నట్లు తనపై రమేష్ వర్గం దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి గానీ ఆయన మద్దతుదారులను కానీ ఎదుర్కోవటానికి తాను ఎప్పుడూ సిద్దమేనని కూడా మంత్రి బహిరంగంగా చెప్పటం జిల్లా పార్టీలో చర్చనీయాంశమైంది.
జమ్మలమడుగులో టిక్కెట్టు
తన నియోజకవర్గంలో రమేష్ కంపెనీ వందల కోట్ల రూపాయల పనులు చేస్తున్నా తానేనాడు పట్టించుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో పోటీ చేసేది తానే అంటూ ప్రకటించారు. టిక్కెట్టు రాకుండా ఎంత మంది అడ్డుపడినా చంద్రబాబు మాత్రం టిక్కెట్టు తనకు ఇస్తారన్న విశ్వాసం ప్రకటించారు. భవిష్యత్తులో తాను తీసుకోబోయే ఎటువంటి నిర్ణయమైనా మద్దతుదారులతో, కార్యకర్తలతో చర్చించే తీసుకుంటానన్నారు. మంత్రి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మద్దతుదారులకన్నా శతృవులే ఎక్కువున్నట్లు అర్ధమైపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతారో చూడాల్సిందే.