దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ ధరల సవరణ విధానం మొదలయ్యాక.. ఇంత భారీస్థాయిలో ధరలు పెరగటం ఇప్పుడే. దేశవ్యాప్తంగా చూసుకుంటే.., ఆంధ్రప్రదేశ్ లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుప్రజల్ని పెట్రోధరాఘాతం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ తో 19 రోజుల పాటు ధరలు పెంచని చములు సంస్థలు.. గత ఏడురోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచేసుకుంటున్నాయి. దేశచరిత్రలోనే గరిష్ట స్థాయికి చేర్చేశాయి. 2013లో అంతర్జాతీయంగా ముడిచమురు ధర 116 డాలర్లు ఉన్నప్పడుకూ కూడా లీడర్ పెట్రోల్ ధర 80 రూపాయలు దాటలేదు. ఆ ఘనత మన్మోహన్ పాలనకే హైలెట్ గా ఇప్పటికీ ప్రచారంలో ఉంది. అలాంటిది బ్యారెల్ ముడిచమురు ధర 80 డాలర్లు పలుకుతున్న తరుణంలోనూ పెట్రోధరల్ని 85 రూపాయలకు చేరువ చేసిన మోదీ పాలనపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
మోదీ చేతగాని తనం వల్ల పటిష్టంగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్ ఎందుకు అంతగా మథనపడిపోతున్నారో.. దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత కనీ వినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయిన పెట్రోధరలు.. ఎంత బాధ్యతారాహిత్యంగా దేశాన్ని పాలిస్తున్నారో చెప్పకనే చెబుతున్నాయి… కర్ణాటక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాకుండా పార్టీని కాపాడుకోటమే పరమావధిగా, ప్రజా ప్రయోనాలు ఏమాత్రం పట్టించుకోకుండా.., పెట్రోలు, డీజిల్ ధరల్ని తొక్కి పట్టిన కేంద్రం.. గడిచిన వారం రోజులుగా చమురు సంస్థల ఇష్టారాజ్యంగా వదిలేసింది 19 రోజుల పాటు ధరల పెంపుదలకు విరామం ప్రకటించిన చమురు సంస్థలు, ఈ నెల 14 నుంచి మళ్లీ రోజువారీ మార్పులు చేస్తున్నాయి. అప్పటి నుంచి వరుసగా ధరలు పెంచుకుంటూపోతున్నాయి. ఆదివారం పెట్రోలు-డీజిలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 83 రూపాయల ఆల్ టైం హై గా నమోదయ్యాయి…
గత ఏడాది జూన్లో రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఇంత పెద్దమొత్తంలో ధరలు పెరగడం ఇదే ప్రథమం. ఈ ధరల ప్రభావం తెలుగురాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. దేశంలోనే అత్యధిక ధర ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో గత నాలుగు వారాలుగా చమురు ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వరంగ సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి… దేశవ్యాప్తంగా విశాఖపట్నంలో డీజిల్ ధర ఎక్కువగా ఉంది. లీటరు డీజిల్ 73 రూపాయల 95 పైసలుగా నమోదైంది. హైదరాబాద్లో73 రూపాయల 45 పైసలు పలుకుతోంది. కేంద్రపాలిత ప్రాంతాల్ని మినహాయిస్తే., దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ డీజిల్ ధరలు 70 రూపాయల మార్కు దాటేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాల్లో ఆల్ టైం హైకి చేరుకున్నాయి…
2013లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 115 డాలర్లు ఉన్నపుడు కూడా దేశంలో లీటర్ డీజిల్ ధర గరిష్టంగా 71 రూపాయలు మాత్రమే ఉంది. ఐదేళ్ల తర్వాత ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర 79 డాలర్లే ఉన్నప్పటికీ డీజిల్ ధర లీటరు మాత్రం 75 రూపాయలకు సమీపరిస్తుండటంపై దేశవాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది… 2014లో మోదీ ప్రధానమంత్రి అయ్యాక పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆయనకు ఎంతో ఆదుకున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ముడిచమురు ధర 26 డాలర్ల కనిష్టస్థాయికి పడిపోయింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 40 రూపాయలకన్నా తక్కువ ధరలకు అందించే అవకాశం ఎన్డీయే ప్రభుత్వానికి లభించింది. కానీ కేంద్రం మధ్యతరగతి ప్రజలపై కనికరం చూపలేదు. పేదల జేబుల్లోకి వెళ్లాల్సిన పెట్రో ఉత్పత్తుల ప్రయోజనాల్ని కేంద్రం నిర్దయగా తన ఖజానా నింపుకోటానికి మళ్లించింది. దాదాపు ఈ నాలుగేళ్ల కాలంలో క్రూడాయిల్ ధరలకు – దేశంలో అమ్మే పెట్రోల్ ధరలకు మధ్య వ్యత్యాసం కారణంగానే కేంద్రం 15లక్షల కోట్ల రూపాయలు పోగేసుకున్నట్లు అనధికారిక అంచనా…
ఆర్థిక నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో గరిష్టంగా బ్యారెల్ ముడిచమురు ధర 146 డాలర్లు నమోదైన సమయంలో కూడా దేశంలో పెట్రోల్ ధరలు 80 రూపాయలు దాటలేదు. అలాంటిది క్రూడాయిల్ ధరలు సగానికన్నా దిగువకే, అతి చౌకగా లభిస్తున్నప్పటికీ , దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. దేశంలో పరిపాలన ఉందా అనే అనుమానం ప్రజల్లో రాజేస్తున్నాయి.… దేశంలో ఎవ్వరూ ప్రశ్నించినా.. పెట్రో ధరల పెరుగుదల మా పరిధిలో లేని అంశంగా కేంద్రం చెప్పుకుంటూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంత లాభాలు కొంత తగ్గించుకుని పెట్రోల్ ధరల్ని అదుపు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తుంది. చమురు సంస్థల పెంపుతో మాకు సంబంధం లేదంటున్న కేంద్రం.. ఎన్నికల టైంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఎలా కంట్రోల్ చేసిందన్న ప్రశ్న తలెత్తుతోంది… క్రూడ్ ఆయిల్ ధరలు నేల చూపులు చూస్తూ., దేశ ఖజానాకు భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతున్న టైంలో, నోట్ల రద్దు అనే ఓ విఫల ప్రయోగం ద్వారా మోదీ ప్రభుత్వం పటిష్టంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్న మన్మోహన్ సింగ్ ఆరోపణల్ని ఇంతవరకూ ఎన్డీయే ప్రభుత్వం కౌంటర్ చేయలేకపోయింది…
విదేశాల్లో పెద్దలు దాచుకున్న నల్లధనాన్ని అణా-పైసలతో సహా వెనక్కి తెచ్చి.. ప్రతి పేదవాడిఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానన్న మోదీ.. ఆ హామీ నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు నోట్ల రద్దు అనే స్టంట్ చేసి.. పిల్లిమొగ్గలు వేస్తూ.., దుర్భేధ్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవస్థను దుర్భలంగా మార్చేశారన్న మన్మోహన్ ఆరోపణలు ఇప్పుడిప్పుడే దేశ ప్రజల్ని ఆలోపింపజేస్తున్నారు… 2016లో నొట్ల రద్దు కారణంగా చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దలేక, మరింత కూలిపోకుండా చూసేందుకే మోదీ సర్కార్.. పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని అదుపు చేయకుండా చమురు సంస్థల పరం చేసేసిందన్న విమర్శలకు కేంద్రం నుంచి సమాధానం లేదు. మన్మోహన్ ఆరోపిస్తున్నట్లు పటిష్టంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ అనుభవం, అవగాహనా లేని గుజరాతీ టీం చేతుల్లో పడి ధ్వంసం అవుతుందేమో అనే భయాందేళనలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. పెరుగుతోన్న పెట్రోలియం ధరలు ఆ భయాల్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి…