2014లో దేశవ్యాప్తంగా ఒకటే నామస్మరణ.. అదే `నమో.. నమో..`!! ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా ఇదే పేరు. సోషల్ మీడియాలో ఇక చెప్పుకోవాల్సిన పనేలేదు! టీవీ చానళ్లలో ఆ పేరు దద్దరిల్లింది. ఆ ఒక్కపేరే కమనాథులను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టింది. దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు చిగురించేలా చేసింది. ఆర్థిక వ్యవస్థపై భరోసా కలిగించేలా చేసింది. పేదవాడి మోములో చిరునవ్వులు విరబూస్తాయనే నమ్మకాన్ని కలిగించి. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ పేరు వింటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2014లో ఆయనే కావాలి.. కావాలి అనుకున్న వారే.. 2019 ఎన్నికల్లో `వద్దు మహాప్రభో` అంటున్నారట.
నాడు జేజేలు పలికిన వారే.. ఇప్పుడు `ఇక చాలు.. జావో` అనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చేశారట. మీ బతుకుల్లో `అచ్ఛేదిన్` వస్తాయని చెప్పిన ఆయనకు.. ఇక వచ్చేవన్నీ `బురాదిన్` అని స్పష్టం చేశారట. దేశ వ్యాప్తంగా ఏబీపీ న్యూస్ సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన సర్వే ఇప్పుడు దుమారం రేపుతోంది. నరేంద్రమోడీ.. 2014 ఎన్నికల సమయంలో ఈ ఒక్కపేరు దేశంలో మారుమోగిపోయింది. ఏ రాష్ట్రంలో చూసినా మోదీ మ్యానియా స్పష్టంగా కనిపించేంది. అప్పటికే అనేక కుంభకోణాల్లో మునిగిపోయిన దేశప్రజలు మోదీ వైపు ఆకర్షితులయ్యారు. గోరంతకు కొండంతను చేసి మాట్లాడటంలో సిద్ధహస్తులైన వారంతా మోదీని దేశోద్ధారకుడిగా అభివర్ణించి చేసిన ప్రచారం ప్రజల్లో మెదళ్లలో బలంగా నాటుకుపోయింది.
ఎన్నో కలలు.. మరెన్నో హామీలు.. వాగ్ధానాలు ఒక్కటా రెండా.. అధికారమివ్వండి దేశానికి అచ్ఛేదిన్ వస్తాయని చేసిన గంభీర ప్రసంగాలు జలజలా ఓట్లు రాల్చాయి. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా మోదీ.. మాటల గారడీకే పరిమితమయ్యారనే విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంపై నానాటికీ ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో మోదీ ఇమేజ్ క్రమంగా పడిపోతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. వాటికి అండగా నిలబడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అదే సమయంలో కేంద్రంపై ప్రజావ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం బాగుండదని ఏబీపీ న్యూస్ సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడయింది.
బీజేపీకి రెండో సారి అవకాశం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారా అన్న అంశంపై జరిగిన సర్వేలో 47 శాతం మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా నో అని చెప్పారు. 39 శాతం అవకాశం ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి 2014 ఎన్నికలకు వెళ్లే ముందు యూపీఏ టూ ప్రభుత్వంపైన చేసిన సర్వేలో ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు అవే ఫలితాలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో యూపీఏ ఘోరపరాజయం మూటగట్టుకుంది. అప్పట్లో 39శాతం మంది ప్రభుత్వానికి మళ్లీ చాన్సివ్వబోమని చెప్పగా.. 31 శాతం మంది ఇస్తామని చెప్పారు.
ఇప్పుడు కూడా.. అలాంటి సర్వేల ఫలితాలే రావడంతో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. కొన్ని వర్గాల్లో నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడయింది. మైనార్టీలు, క్రిస్టియన్లు, సిక్కుల్లో… 70, 80 శాతం మంది తాము మరోసారి.. మోదీ ప్రభుత్వానికి ఓటు వేసే అవకాశం లేదని తేల్చిచెప్పారు. గిరిజనుల్లోనూ అదే భావన ఉందని సర్వేలో వెల్లడయింది. అదే సమయంలో హిందూ ఓటర్లలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది.
44 శాతం మంది బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. 42 శాతం మంది మాత్రం అవకాశం ఇవ్వబోమంటున్నారు. అదే సమయంలో ఏడాది చివరిలో ఎన్నికలు జరిగితే.. 34 శాతం మంది బీజేపీకి మద్దతిస్తామన్నారు. కానీ.. సరిగ్గా సమయానికే ఎన్నికలు జరిగితే.. ఓటేస్తామన్నవారి సంఖ్య 32 శాతానికి పడిపోయింది. మొత్తానికి నాలుగేళ్లలో మోడీ ఇమేజ్ కొండ క్రమక్రమంగా కరిగిపోవడం పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది.