ఏపీలోనూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తాయా? ఇక్కడ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదా? అంటే .. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయని అంటున్నారు మేధావులు. నిజానికి ఏ ఎన్నికలు జరిగినా.. ఏదో ఒక పార్టీకి ప్రజలు పట్టంగడుతున్నారు. తమకు నచ్చిన నేతను, తమకు సేవ చేస్తుందని భావించిన పార్టీకి పట్టం గడుతున్నారు. అయితే, 2019 ఎన్నికలు మాత్రం ఏపీ సంప్రదాయాన్ని తిరిగి రాయనున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో 2014 ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు కనిపించక పోవడం, లెక్కకు మిక్కిలి పార్టీలు ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధపడడం వంటి కారణాలు ఏపీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
2014 ఎన్నికల సమయంలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఎన్నికల పోరు సాగింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు మద్దతుగా అప్పటికే పార్టీని స్థాపించిన జనసేనాని పవన్ కళ్యాణ్ను తెచ్చుకున్నారు. జాతీయ పార్టీ బీజేపీతోనూ జట్టుకట్టారు. మరోపక్క, ఒంటరిగానే బరిలోకి దిగిన జగన్.. బాబుతో తలపడ్డారు. దీంతో అప్పటి ఎన్నికలు అయితే, టీడీపీ. లేకుంటే వైసీపీ అన్న విధంగానే సాగాయి. దీంతో ప్రజలు ``అనుభవం``- పేరుతో చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీలో రాజకీయ వ్యూహాలు మారిపోయాయి. పార్టీల ఎత్తులు.. గమ్మత్తుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సొంతగా మెజారిటీ రాబడుతుందనేది కల్లో మాటేనని మేధావులు అంటున్నారు.
ఇప్పటికిప్పుడున్న రాజకీయ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తంగా ఆరు ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో నిలవనున్నాయి. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, జనసేనలు ప్రధాన పార్టీలు. వీటిలో జనసేన-వామపక్షాలు కూటమిగా వెళ్తాయని అనుకుంటే.. మిగిలిన పార్టీలు మాత్రం ఒంటరిగానే పోరాడతామని ఇప్పటికే స్పష్టం చేశాయి. దీంతో ప్రధాన పోరు మళ్లీ వైసీపీ, టీడీపీల మధ్యే ఉంటుందని పైకి కనిపించినా.. చాపకింద నీరులా పెరుగుతున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈ రెండు పార్టీలకు దెబ్బకొట్టే అవకాశం ఉంది. ఇక, టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరుకు సిద్ధమవుతోంది. దీంతో టీడీపీ ఓటుబ్యాంకు చీలకున్నా.. చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.
ముఖ్యంగా ఎమ్మెల్యేల వైఖరితో విసిగిపోయిన ప్రజలు .. టీడీపీకి ఓట్లు వేయని పక్షంలో అటు జనసేన, లేదా వైసీపీలకు ఈ ఓట్లు పడే చాన్స్ కనిపిస్తోంది. ఇక, కొన్ని నియోజకవర్గాల్లో బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకు నేటికీ చెక్కుచెదరలేదు. దీంతో ఆయా నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి పెడితే.. అవి కూడా టీడీపీ, వైసీపీలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక, బీజేపీ కనీసం నాలుగు స్థానాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే.. గత ఎన్నికలకు భిన్నంగా 2019 ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకీ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల తర్వాత ఏయే పార్టీలు జట్టుకడతాయనే చర్చ సాగుతోంది. మరి నేతలు ఎలాటి యూటర్న్ తీసుకుంటారో చూడాలి.