తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల వేళ కప్పుల తక్కెడలు స్టార్ట్ అయ్యాయి. తమకు నచ్చని వ్యక్తులను పార్టీల్లోకి తీసుకోవడంతో అలుగుతున్న పలువురు సీనియర్ నాయకులు ఇప్పుడు తమ ప్రత్యర్థి వచ్చిన పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ టైప్ రివర్స్ జంపింగ్లు జోరందుకుంటున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్రెడ్డి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయనతో దశాబ్దాల వైరం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్లోకి వెళ్లే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే ఉంటూ నాగర్కర్నూలు రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న దామోదర్రెడ్డి సౌమ్యుడిగా కూడా పేరుంది. ఉమ్మడి జిల్లాలో జిల్లాపరిషత్చైర్మన్గా ఉన్న ఆయన ప్రస్తుతం నాగర్కర్నూలు కాంగ్రెస్ ఇన్చార్జ్గా కూడా ఉన్నారు. తాను ఎంత వద్దన్నా వారించకుండా తనకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన నాగంను కాంగ్రెస్లోకి తీసుకోవడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక నాగర్కర్నూలు టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాగంకు హామీ ఇచ్చినట్టు వార్తలు రావడం, ఇదే విషయాన్ని నాగం కూడా ప్రచారం చేసుకోవడంతో దామోదర్రెడ్డి ఆవేదనతో ఉన్నారు. తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు విషయంలో డైలమాలో ఉన్న ఆయన పార్టీ మార్పు ఆలోచన చేస్తున్నారు. నాగంను పార్టీలో చేర్చుకోవద్దని దామోదర్రెడ్డి పార్టీ అదిష్టానాన్ని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నా అయినా నాగంను పార్టీలో చేర్చుకునేందుకే ఢిల్లీ పెద్దలు మొగ్గుచూపారు.
మంత్రి మధ్యవర్తిత్వం....
దామోదర్రెడ్డి అసంతృప్తితో ఉన్న విషయాన్ని గ్రహించిన టీఆర్ఎస్ అధిష్టానం ఓ మంత్రి ద్వారా ఆయనతో మధ్యవర్తిత్వం నెరపినట్టు తెలుస్తోంది. ఆయన కార్యకర్తలతో మాట్లాడి వెంటనే తన నిర్ణయం ప్రకటిస్తానని కూడా చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం దామోదర్రెడ్డి నాగర్కర్నూల్లోనే మకాం వేసి తన అనుచరగణంతో పార్టీ మార్పు అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. టీఆర్ఎస్లోకి వెళితే ఆయన వారసుడికి నాగర్కర్నూలు సీటు ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది.
ఇక పాత మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ దామోదర్రెడ్డిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నాగర్కర్నూలు సీటు తనకు లేదా తన వారసుడికి ఇస్తామని హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని... లేకపోతే తన దారి తాను చూసుకుంటానని ఇప్పటికే తెగేసి చెప్పినట్టు జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.