చంద్రబాబు నాయుడు బిజెపితో తన పార్టీ రాజకీయ సంభందాలు తెగతెంపులు చేసుకుని చాలా కాలమైంది. అప్పటి నుండి ప్రధాని నరెంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మాటలతో చెలరేగి పోతున్నారు. దీక్షల చేతలతో దుమ్ము రేపుతున్నారు. మనసుల నిండా వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా ఆయన మనసా, వాచా, కర్మణా మోదీ-షా నామ స్మరణే చేస్తూ వారిని మరచిపోలేక పోతున్నారు. నాలుగేళ్ల దాంపత్యం అంత వీజీగా మరచిపోయెదా? ఒక సారైనా వారిని చూడాలనిపిస్తూ ఉండవచ్చు. ఆయన మనసు పసిగట్టిన దైవం ఒక అవకాశం ఇచ్చారనిపిస్తుంది.
ఈ నెల 16వ తేదీన జరగనున్న 'నీతి ఆయోగ్ సాధారణ మండలి సమావేశం' వీరి కలయిక వేదిక కానుంది. రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్రం నుంచి వైదొలిగి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి, బీజేపీతో "విడాకులు" తీసుకున్నాక వీరిద్దరూ కలిసి ఏ కార్యక్రమం లోనూ ఇప్పటివరకు పాల్గొనలేదు.
నిజంగా చెప్పాలంటే పొత్తు కొనసాగుతున్న చివరి దశలో కూడా మోదీని ఆయన కలవలేదు. ఈ నెల 16న జరిగే సమావేశంలో ప్రధానిని కలిసి, చంద్రబాబు అడగాల్సిన వన్నీ అడిగేసే అవకాశం, కడగాల్సినవన్నీ కడిగేసే అవకాశం కూడా ఉందంటున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే ఈ ఈ మండలి భేటీలో దేశంలోని అన్నిరాష్ట్రాల ముఖ్య మంత్రులు సభ్యులుగా ఉంటారు. పాలుపంచుకోవాలని చంద్రబాబు కూడా నిర్ణయించారు.
కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీ, రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో నీతి ఆయోగ్కు కేంద్రం ఇచ్చిన టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీవోఆర్)పై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మన రాష్ట్రంతో పాటు కేరళ, పశ్చిమ బంగా, ఢిల్లీ, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలు గళమెత్తాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ విమర్శిస్తోంది. నీతి ఆయోగ్ అనేది కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించిందే తప్ప అదేమీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. దానికి విరుద్ధంగా ఫలానా నిబంధనల ప్రకారమే రాష్ట్రాలకు నిధుల పంపిణీ ఉండాలంటూ మోదీ ప్రభుత్వం నీతిఆయోగ్కు టీవోఆర్ ఇచ్చింది.
నీతి ఆయోగ్ చేయాల్సిన పనిని కేంద్రం చేయడం ఏమిటని కేరళలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం మండి పడింది. ఆ ఆర్థికమంత్రుల రెండో సమా వేశం అమరావతిలో నిర్వహించారు. ఇప్పుడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. అక్కడే ప్రధానిని కేంద్రం వైఖరిపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పడం జనాభా నియంత్రణ కోసం బాగా కృషిచేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించ నుంది. సందర్భం ఏదైనా చాలా రోజుల తర్వాత మోడీ, చంద్రబాబు ఒకే సమావేశంలో కలవడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు 16వ తేదీన రంజాన్ పండుగ. ఆ రోజు సమావేశం పెట్టడమేంటని పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని 17వ తేదీకి గానీ, మరో తేదీకి గానీ వాయిదా వేయాలని అడుగుతున్నట్లు సమాచారం. రంజాన్ రోజే పెడితే హాజరు కాబోనని ఆమె చెబుతున్నారు. ఈ నేపథ్యం లో సమావేశం తేదీని మార్చేదీ లేనిదీ త్వరలోనే స్పష్టత రానుంది.