ఏపీ బీజేపీని ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు, ఆ తర్వాత అని రెండుగా విభజించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో అప్పటి తెలంగాణ మిత్రులకు అనుకూలంగా బీజేపీ పావులు కదిపింది. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని బీజేపీ జాతీయ నేతలు నొక్కి చెప్పారు. నిజానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం వెనుక కొంత బీజేపీ ఫార్ములా స్పష్టంగా పనిచేసిందనేది నిపుణుల మాట. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకునే క్రమంలో కూడా తెలంగాణకు కాంగ్రెస్ మొగ్గు చూపింది. అయితే, ఈ ప్రభావం ఏపీలో కాంగ్రెస్పైనే ఎక్కువగా పడింది.
ఇక, 2014 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రభావంతో ఈ విషయాన్ని బాబు కూడా ఉద్దేశ పూర్వకంగానే తొక్కి పెట్టారు. రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్కు ఎంత పాత్ర ఉందో.. అంతే పాత్ర బీజేపీకి కూడా ఉంది. అయినా.. తాను పొత్తు పెట్టుకున్నందున చంద్రబాబు వ్యూహాత్మకంగా దీనిని తొక్కిపెట్టారు. ఇక, తన మాటను ఖాతరు చేయకపోవడంతో చంద్రబాబు.. బీజేపీతో ఉన్న తన పొత్తును నిర్ద్వంద్వంగా వదులుకున్నారు. మరోపక్క ఏపీలో వైసీపీ సహా జనసేనలు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తుండడం, ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న సమయంలో బీజేపీతో అంటకాగితే.. టీడీపీకి డిపాజిట్లుకూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో బాబు అనూహ్యంగా బీజేపీకి రాంరాం చెప్పారు.
ఇక, ఆ తర్వాత బీజేపీ ఒంటరి అయిపోయింది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి పెద్ద సీన్లేదు. కానీ, 2014లో చంద్రబాబు చలవ కారణంగానే దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీకి దక్కారు. ఇక, అదేసమయంలో రాజ్యసభ టికెట్ను సైతం చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. ఫలితంగా మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు.. ఏపీ నుంచి ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఇంతగా ఏపీ నుంచి కేంద్రంలోనిబీజేపీకి ఎంతో మేలు జరిగినా.. చేసింది మాత్రం శూన్యమనే వాదన బలంగానే వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఏపీకి 85% హామీలను నెరవేర్చామని చెప్పుకొంటున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చాయని కూడా అంటున్నారు. పోలవరం, రాజధానికి కూడా నిధుల వరద పారిందని చెబుతున్నారు. అయితే, వాస్తవానికి ఇవన్నీ వచ్చి ఉంటే.. ఇప్పుడు ఇంతగా రగడ ఉండేది కాదు కదా? అన్న ప్రశ్నకు మాత్రం వారి నుంచి సరైన సమాధానం లభించడం లేదు. ఇక, ప్రత్యేక హోదాను అటకెక్కించిన బీజేపీ.. నెపాన్ని బాబుపై నెట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తోంది. ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి.
నిజానికి హోదా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తినా.. స్వయంగా జనసేనాని పవన్ కూడా హోదాకు మద్దతిచ్చినా.. బాబు బీజేపీ ఇచ్చిన ప్యాకేజీకి జైకొట్టారు. అయినా కూడా కేంద్రం ఆ ప్యాకేజీ నిధులను కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే బాబు బీజేపీతో కటీఫ్ చెప్పారు. ఈ మొత్తం పర్యవసానంలో బీజేపీ స్వయం కృతమే ఎక్కువగా కనిపిస్తోంది తప్ప.. ఏదో బాబు తమను మోసం చేశారని, మధ్యలోనే వదిలేశారని అనడం బీజేపీ నేతలు అపరిపక్వ విధానాన్నే తేటతెల్ల చేస్తోంది. మొత్తంగా బీజేపీతో కటీఫ్ చెప్పి... వాళ్లను ఇక్కడ బాగా ఇరికించేసి బాబు బాగుపడ్డారనడంలో సందేహం లేదు.