త్వరలో నెల్లూరు జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. జిల్లాలో రాజకీయంగా బలమైన కుటుంబాల్లో ఒకటైన ఆనం ఫ్యామిలి టిడిపిని వదిలేయటం ఖాయమైంది. చాలా కాలంగా ఊగిసలాడుతున్న ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ భవితవ్యం ఒకదారిలోకి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇంతకాలం ఆనం చేరికను అడ్డుకుంటున్న వైసిపి నేతలు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నారు. ముహూర్తం ఎప్పుడన్నదే తేలాల్సుంది.
రాజకీయ ఇబ్బందుల్లో ఆనం కుటుంబం
ఇంతకీ విషయం ఏమిటంటే, కాంగ్రెస్ లో దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఆనం కుటుంబం ప్రస్తుతం రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. అయితే, రాజకీయంగా బాగా వెలిగిన వారు కాబట్టి ఓ మూలన కూర్చోవటం సాధ్యం కాలేదు. అందుకని వైసిపిలో చేరాలని అనుకున్నారు. అయితే, వైసిపిలో ఎటు చూసినా శతృవులే. అందుకే వైసిపి నేతలు మూకుమ్మడిగా ఆనం సోదరులు వైసిపిలో చేరటాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారిలో నెల్లూరు అర్బన్, రూరల్ ఎంఎల్ఏలు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మేకపాటి కుటుంబం కీలకం. ఇంతమంది వ్యతిరేకించటంతో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారు.
తప్పని స్ధితిలోనే టిడిపిలో చేరిక
ఎప్పుడైతే వైసిపిలో చేరటం సాధ్యం కాదని అనుకున్నారో వెంటనే తెలుగుదేశంపార్టీ వైపు చూశారు. అయితే అక్కడ కూడా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, తెరవెనుక ఏం జరిగిందో కానీ విషయం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో సోదరులిద్దరూ తమ మద్దతుదారులతో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. చంద్రబాబు కూడా సహజధోరణిలో వారికి ఎన్నో హామీలను ఇచ్చేశారు. అయితే, టిడిపిలో చేరిన తర్వాత ఆనం సోదరులను పట్టించుకోవటం మానేశారు. దాంతో సోదరులకు ఏం చేయాలో దిక్కు తెలీలేదు.
టిడిపిలో ఎన్ని అవమానాలో
చంద్రబాబు పట్టించుకోకపోవటం ఒక ఎత్తైతే జిల్లాలో టిడిపి నేతలెవరూ సోదరులను దగ్గరకు కూడా రానీయటం లేదు. పేరుకు అధికారపార్టీలో ఉన్నారన్న మాటే కానీ ఒక్క అధికారి కూడా వాళ్ళ మాట వినటం లేదు. దాంతో టిడిపిలో చేరి తప్పు చేశామన్న భావన సోదరులతో పాటు వారి మద్దతుదారుల్లో మొదలైంది. దాంతో ఎలాగైనా సరే సోదరులను వైపిపిలో చేరాలంటూ మద్దతుదారుల నుండి ఒత్తిడి మొదలైంది. ఈ నేపధ్యంలోనే ఆనం వివేకానందరెడ్డి అనారోగ్యంతో మంచాన పడ్డారు. చివరకు అనారోగ్యం పెరిగిపోయి ఈ మధ్యనే చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
కాలమే పరిష్కరించిన సమస్య
ఆనం సోదరులను వైసిపి నేతలు ఎందుకు వ్యతిరేకించారంటే వివేకా నెల్లూరు నుండి రామనారాయణ ఆత్మకూరు నుండి ప్రాతినిధ్యం వహించేవారు. వారిద్దరూ వైసిపిలోకి వస్తే వైసిపి ఎంఎల్ఏలతో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి పూర్తిగా డిస్ట్రబ్ అవుతారు. అందుకే వాళ్ళు వ్యతిరేకించారు. ఎప్పుడైతే వివేకా మరణించారో రామనారయణ మీద సింపతి పెరిగింది. దానికితోడు మేకపాటి కుటుంబంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతోంది. నెల్లూరు ఎంపిగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజ్యసభకు వెళ్ళాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆత్మకూరు ఎంఎల్ఏగా ఉన్న కొడుకు మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎంపిగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట. అదేగనుక నిజమైతే రామనారాయణకు ఆత్మకూరులో లైన్ క్లియర్ అయినట్లే. అదే విధంగా వివేకా మరణంతో నెల్లూరు అర్బన్ , రూరల్ ఎంఎల్ఏలకు సమస్య లేకుండా పోయింది. దాంతో వైసిపి నేతలు రామనారాయణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రామనారాయణ వైసిపిలో చేరికతో అటు ఆత్మకూరుతో పాటు ఇటు నెల్లూరు ప్రాంతాల్లో వైసిపి మరింత బలోపేతం అవ్వటం ఖాయం.