ఆంధ్రా ఆక్టోపస్ గా ప్రచారంలో ఉన్న మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ తో కలిసి చేసిన సర్వే అంటూ టిడిపికి మద్దతుగా నిలబడే మీడియాలో అచ్చైన సర్వేపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అయితే, లగడపాటి సర్వే అంటే ఆందరూ ఆశక్తిగా చూస్తారు. కానీ ఈ సర్వే వివరాలను చూస్తుంటే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ సర్వేలో ఏముందంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 110 సీట్లతో తెలుగుదేశంపార్టీనే అధికారంలో వస్తుందని సర్వేలో తేలిందట. పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే టిడిపి బలం పెరిగిందని, వైసిపి బలం తగ్గిందని జనాలను నమ్మించటమే సదరు మీడియా ఉద్దేశ్యంగా స్పష్టమవుతోంది.
పెరగని చంద్రబాబు గ్రాఫ్
సర్వే వివరాల ప్రకారం మొత్తం 175 సీట్లలో 44.04 శాతం ఓట్లతో టిడిపి 110 సీట్లు గెలుచుకుంటుందట. 37.46 శాతం ఓట్లతో వైసిపి 60 సీట్లలో గెలుస్తుందట. జనసేన 8.90 శాతం ఓట్లు, కాంగ్రెస్, బిజెపిలు 1 శాతానికి కాస్త అటు ఇటుగా ఓట్లు తెచ్చుకుంటాయట. ఇంకా నిర్ణయించుకోలేదు, ఇతరులు కలిపి 5.4, 1.07 శాతం అట. సర్వే ప్రకారం చూసినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గ్రాఫ్ ఏమీ పెరగలేదు. ఎలాగంటే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు, బిజెపి, పవన్ కల్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేసినా చంద్రబాబుకు వచ్చింది 44.45 శాతం ఓట్లతో 101 సీట్లు. ఇక, వైసిపి 44.12 శాతం ఓట్లతో 67 సీట్లు గెలుచుకుంది.
సర్వేలో తగ్గిన చంద్రబాబు ఆధరణ
పోయిన ఎన్నికల్లో చంద్రబాబుకు 44.45 శాతం ఓట్లు రాగా తాజా సర్వేలో 44.04 శాతం ఓట్లే వచ్చాయి. అంటే .41 శాతం ఓట్లు తగ్గిన విషయం స్పష్టంగా కనబడుతోంది. అదే సమయంలో వైసిపి 44.12 శాతం ఓట్లు తెచ్చుకోగా తాజా సర్వేలో 37.46 శాతంకు పడిపోయినట్లు చూపించారు. అటు అధికార పార్టీకి ఓట్ల శాతం తగ్గి, ఇటు ప్రధానప్రతిపక్షానికి ఓట్ల శాతం తగ్గిపోతే మరి పెరిగిందెవరకి ? ఇక్కడే సర్వే పేరుతో పెరిగిన శాతాన్ని జనసేన ఖాతాలో వేసేశారు. జనసేనకు పెరిగిన ఓట్ల శాతమంతా వైసిపి నుండే మళ్ళిందన్నది సర్వే చేసిన వారి ఉద్దేశ్యం.
హామీల అమలులో చంద్రబాబు సక్సెస్సేనా ?
ఏ రకంగా చూసినా నాలుగేళ్ళల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గ్రాఫ్ పెరగకపోగా తగ్గిందన్నది సర్వేలోనే స్పష్టంగా తెలిసిపోతోంది. అదే సమయంలో వైసిపి ఓట్ల శాతం ఎందుకు తగ్గిందో మాత్రం సర్వే చెప్పలేకపోయింది. అధికారపార్టీ ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలు తారస్ధాయికి చేరుకుంది. ఎంఎల్ఏల అవినీతంటే ప్రభుత్వ వైఫల్యమని వేరే చెప్పక్కర్లేదు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం కారణంగా అనేక సామాజికవర్గాలు మండిపోతున్నట్లు ప్రచారంలో ఉంది. విభజన హామీల అమలులో కూడా చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు వైఫల్యాల గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. కానీ ఘనత గురించి చెప్పాలంటే మాత్రం వెతుక్కోవాల్సిందే.
110 సీట్లు ఎలా వస్తాయి ?
ఇటువంటి పరిస్దితుల్లో చంద్రబాబుకు మళ్ళీ 110 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందంటే నమ్మబుద్ది కావటం లేదు. పైగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాలు బ్రహ్మరధం పడుతున్నారు. పాదయాత్రలో పాల్గొనే జనాలందరూ ఓట్లు వేస్తారని అనుకునేందుకు లేదు. పోయిన ఎన్నికల్లో టిడిపికి బాగా కలసివచ్చిన పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లో టిడిపి బలహీన పడిన మాట వాస్తవం. పై రెండు జిల్లాల్లో వైసిపికి చెరో నాలుగు సీట్లొచ్చినా జగన్ కు ప్లస్ క్రిందే లెక్క. ఇక, పవన్ విషయాన్ని చూస్తే ఏ విషయంలోనూ స్పష్టత లేదు. చెప్పే మాటల్లో నిలకడ లోపించటమే పవన్ కున్న ప్రధాన సమస్య. ఫ్లాష్ సర్వే పేరుతో గతంలో ప్రకటించిన వివరాల ప్రకారం చూసినా చంద్రబాబుకు 30 సీట్లు తగ్గాయి. అప్పట్లో చంద్రబాబుకు 140 సీట్లు ఇచ్చిన సర్వే తాజాగా 110 సీట్లు మాత్రం ఇచ్చింది. అప్పట్లో జగన్ కు 30 సీట్లు ఇవ్వగా ఇపుడు 60 సీట్లంటున్నారు. అంటే ఇంకో ఆరుమాసాల తర్వాత సర్వే చేస్తే టిడిపికి ఇంకెన్ని సీట్లు తగ్గిపోతాయో ?