భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నమ్మినబంటు..గెలుపు కోసం అద్భుతమైన వ్యూహాలు రచించే సమర్ధవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాంమాధవ్. రాష్ట్రమేదైనా పార్టీని గెలిపించగలిగే నేత రాంమాధవ్ను బీజేపీ పక్కనబెట్టిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో మోదీ కి అత్యంత విశ్వాసపాత్రులైన వారిలో అమిత్ షా తర్వాత రాంమాధవ్ కే ఎక్కువ పేరు ఉంది. అలాంటి రాంమాధవ్ ని బీజేపీ ఈ మద్య పక్కన బెడుతుందని సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి.
కశ్మీర్లో పీడీపీతో బీజేపీ పొత్తు వెనక ఉన్నది కూడా ఆయనే. విజయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆయనను ఇప్పుడు పార్టీ పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. కశ్మీర్ వైఫల్యంతో ఒక్కసారిగా ఆయన ప్రతిభ మసక బారింది. అయితే గత కొంత కాలంగా పీడీపీతో రాం మాధవ్ మెతక వైఖరి వల్ల దేశవ్యాప్తంగా పార్టీకి నష్టం కలిగిందన్న భావనతో ఆయనకు బీజేపీ దూరం అయ్యిందని వార్తలు వస్తున్నాయి. పీడీపీ ప్రభుత్వానికి రాంమాధవ్ తొలి నుంచీ అండగా నిలుస్తూ వస్తున్నారు.
ఇది సహించలేని మోదీ-అమిత్ షాలు రాంమాధవ్కు మాటమాత్రమైనా చెప్పకుండానే పీడీపీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మద్య మోదీ-అమిత్ షా ద్వయం ఇప్పుడు జీవీఎల్ నరసింహారావును ప్రోత్సహిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆ మద్య కర్ణాటకలో ఎన్నికల్లో అన్నీ తానై నడిచిన రాంమాధవ్ అక్కడ సరైన విధంగా గెలిపించలేక పోయారు. ఈ వైఫల్యాలకు రాంమాధవ్ను బాధ్యుడిని చేస్తూ పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది.