'కాం ట్రాక్టర్ల కోసం, తానేదో చేస్తున్నానని ప్రభుత్వం చెప్పుకవటం కోసమే పోలవరం ప్రాజెక్టు పనికొస్తుంది...ఇది తాజాగా పర్యావరణం, పోలవరం ప్రాజెక్టు నిర్వాశితుల కోసం ఏళ్ళ తరబడి పోరాటం చేస్తున్న పెంటపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు. సంవత్సరాల తరబడి అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు బాగా ఉపయోగపడుతున్న పోలవరం ప్రాజెక్టుపై పుల్లారావు తన అభిప్రాయాలను ఏపి హెరాల్డ్ తో వెబ్ సైట్ తో పంచుకున్నారు. పుల్లారావు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు వల్ల మన రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం ఉండదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ?
పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాలకు నీరందుతుందని జరుగుతున్న ప్రచారంలో పెద్దగా వాస్తవం లేదన్నారు. నిజంగానే లక్షలాది ఎకరాలకు సాగు నీరందేట్లుగా ఉంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు. అందే నీరు మొత్తం వరి, చెరకు లాంటి పంటలకు మాత్రమే అందుతుందని కూడా అన్నారు. ఈ పంటల వల్ల రైతులకు వచ్చే ఉపయోగాలేంటని అడిగారు. వాణిజ్య పంటలైన పళ్ళు, పూలు సాగు చేసే రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏమాత్రం ఉపయోగాలు ఉండదన్నారు. కొంతమందికి మాత్రం త్రాగు నీరందితే అందవచ్చని అన్నారు.
కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టా ?
ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వాలు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతిని గుర్తు చేశారు. ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా పెద్ద ఉపయోగం లేదన్నారు. ఎందుకంటే, వేల కోట్ల రూపాయల అప్పుపై చెల్లించాల్సి వడ్డీ మందం కూడా ప్రభుత్వానికి తిరిగిరానపుడు ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగమేంటని ప్రభుత్వాలను నిలదీశారు. కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తానేదో చేస్తున్నట్లు ప్రభుత్వం జనాలకు చెప్పుకోవటానికి కూడా ఉపయోగపడుతుందన్నారు.
నిర్వాశితులకు లాభం జరగాలి
ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రాజెక్టు ఏర్పాటు వల్ల నిర్వాశితులైన లక్షలాది మంది పేదలకు లాభం జరగాలన్నారు. వాళ్ళ బ్రతుకులు బాగు చేయటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుకు 30 మైళ్ళ పరిధిలోని ఉభయగోదావరి జిల్లాల ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వాపోయారు. కేంద్రప్రభుత్వం తలచుకుంటే నిర్వాశితుల సమస్యలను వెంటనే పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని కూడా పుల్లారావు వ్యక్తం చేశారు.
బిజెపి పర్యటన వల్ల లాభమేంటి ?
ప్రాజెక్టును సందర్శించటానికి బిజెపి రాష్ట్ర నేతలు ఆదివారం పోలవరంకు వస్తున్నట్లు చెప్పారు. ఏదో మొక్కుబడి పర్యటన కోసం కాకుండా ప్రాజెక్టు కోసం నిర్వాశితులైన బాధితుల గురించి కూడా బిజెపి నేతలు ఆలోచించాలన్నారు. ఎప్పటికైనా ప్రాజెక్టు పూర్తయితే మనకన్నా ఛత్తీస్ ఘర్, ఒడిస్సా, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలకే ఎక్కువ ఉపయోగమని కూడా పుల్లారావు స్పష్టం చేయటం గమనార్హం.