ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీలో డీ శ్రీనివాస్ కదలికలు కలకలం రేపుతున్నాయి. చాలా రోజులుగా పార్టీలో ఆయన తీవ్ర అసంత`ప్తితో ఉన్నారనీ, ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనీ, ఇందులో భాగంగానే ఆయన మూడు రోజులపాటు ఢిల్లీలో మకాం వేశారని వస్తున్నవార్తలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు డీఎస్పై వేటు వేసేందుకు గులాబీ బాస్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈరోజు జిల్లా నేతలందరూ కలిసి ఎంపీ కల్వకుంట్ల కవిత నివాసలో సమావేశం కావడం.. డీఎస్పై చర్యలు తీసుకోవాలంటూ సీఎంక కేసీఆర్ కు లేఖ రాయడం ఇప్పుడు పార్టీలో పెద్ద దుమారమే లేపుతోంది.
డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగువెలిగారు. పీసీసీ చీఫ్గా కూడా ఆయన కొనసాగారు. సోనియాగాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న నేతగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం.. ఆ తర్వాత ఆయన గులాబీ గూటికి చేరడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే.. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీని గ్రూపు సమస్యలు వెంటాడుతున్నాయి. పార్టీలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే.. డీఎస్ తనయుల్లో ఒకరు బీజేపీలోకి వెళ్లి.. టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
డీఎస్తోపాటు మరో తనయుడు టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. కొద్దిరోజుల క్రితం డీఎస్ తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో జిల్లా నాయకత్వంపై విరుచుకుపడ్డారు. తమకు సముచిత స్థానం, గౌరవం ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. తాజాగా.. ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేయడంతో జిల్లా నేతలు అప్రమత్తమయ్యారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీ కవితకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి రాసిన లేఖను పార్టీ జిల్లా బాధ్యులు తుల ఉమకు ఎంపీ కవితతోపాటు నాయకులు అందించారు.
ఇదిలా ఉండగా.. జిల్లా టీఆర్ఎస్ నేతలు తనకు వ్యతిరేకంగా అధిష్ఠానంపై ఫిర్యాదు చేయడంపై స్పందించేందుకు డీఎస్ నిరాకరించారు. జిల్లా నేతలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదని ఆయన అన్నారు. అయితే.. జిల్లా నేతలు చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ను ఈరోజు కలిసి డీఎస్ వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. తన కుమారుడు సంజయ్, ముఖ్య అనుచరులతో డీఎస్ సమావేశమై తాజా పరిణామాలపై చర్చించడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ పరిణామాలు టీఆర్ఎస్ పార్టీకి కొంత మేరకు నష్టం కలిగిస్తాయనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.