విజయ్ మాల్య పేరు వింటేనే భారత ఆర్ధిక వ్యవస్థకు ఝలదరింపు ఒక కుదుపు. బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల ఋణాలను ఒక్కసారిగా ఎగ్గొట్టి బ్రిటీష్ రాజధాని లండన్ లో విలాసాలతో జల్సాలు చేస్తున్న విలాస పురుషుడు విజయ్ మాల్యా. అయితే కాలం మూడితే ఎంతటివాడినా కాలసర్పం వలయంలో చిక్కుకోక తప్పదు. ఆయనకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది.
విజయ్ మాల్యా కు చెందిన ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వ సంస్థలకు లండన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లండన్ కు సమీపం లోని హెర్ట్ ఫోర్డ్ షైర్ లో ఆయనకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేకించి కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా లేడి-వాక్, బ్రాంబుల్-లాడ్జ్, టెవిన్, క్వీన్-హూ-లేన్ లతో పాటు వెల్విన్ లోని మాల్యా ఇళ్ల లో సోదాలు నిర్వహించడానికి అధికారులకు పూర్తి అనుమతులను మంజూర్ చేసింది న్యాయస్థానం.
అంతర్జాతీయంగా భారత్ యూకే పై తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే లండన్ కోర్టు తాజా చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం విజయ్ మాల్యా ను ఇటీవలే "పరారీ లో ఉన్న ఆర్థిక నేరస్థుడు" గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణం గానే కోర్టు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ మాల్యా విషయం లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నామని బ్రిటీష్ న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం.
ఇక భారత్ లొ ఇప్పటి వరకు విజయ్ మాల్యాకు దాదాపు 159చోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు పోలీసులు ఎంఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ తో కలిసి దీనికి సంబంధించిన నివేదికలను నిన్న గురువారం ఢిల్లీ లోని పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు సమయం కావాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు.
మరోవైపు, 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు' ఆగస్టు 27 లోగా విజయ్ మాల్యాను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. విజయ్ మాల్యా మోసంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధి లోని బ్యాంకులతో పాటు 13బ్యాంకుల నెత్తిన భారీ నుంచి అతి భారీ పిడుగు పడింది. మొత్తం రూ.9000కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి అతడు విదేశాలకు పారిపోవటంతో అనేక బాంకులు డోల్డ్రంస్ లోకి వెళ్ళిపోయాయి. భారత ప్రభుత్వ ప్రతిష్ఠ మసక బారింది.