తెలంగాణ రాజకీయాలు ఊపందుకున్నాయి. అక్కడి అదికార పార్టీ సహా అన్ని విపక్షాలూ కూడా ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నాయి. ముఖ్యంగా తిరిగి అధికారం దక్కించుకునేందుకు అధికార టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విస్తృత మంత్రాంగంలో మునిగిపోయారు. ఎవరు ప్లస్లు.. ఎవరు మైనస్లు అని ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. పార్టీకి అండగా ఉంటారని భావిస్తే.. అనామకుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అదేసమయంలో పార్టీకి చేటు చేస్తారనే సమాచారం ఉన్నవారు ఎంతటి వారైనా సరే పక్కకు పెట్టాలని కూడా తీర్మానించుకున్నారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా పార్టీని పట్టించుకోకుండా తన కుటుంబ రాజకీయాలకే పరిమితమైన కాంగ్రెస్ మాజీ దిగ్గజం, టీఆర్ ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ను ఇప్పటికే దాదాపు పక్కకు పెట్టేశారు. ఆయనకు కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు... ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ వాతావరణం.. మొత్తంగా తనకు అనుకూలిస్తుందని ఆయన బావిస్తున్నారు. తాజాగాఆయన తెప్పించుకున్న ఇంటిలిజెన్స్ నివేదికలు సైతం.. రాష్ట్రంలో ఇప్పుడు అధికార పార్టీ వేవ్ భారీ ఎత్తున వీస్తోందని తెలిసింది. దీంతో కేసీఆర్ జమిలికి రెడీ అంటూ కేంద్రానికి సిగ్నల్ పంపారు. తాను ప్రారంభించిన ప్రతి పథకం ఇప్పుడు ఫలాలు ఇవ్వడం ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి రుణాలు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాయి. రెండో దశ గొర్రెల పంపిణీ కూడా ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే పంచిన గొర్రెల ద్వారా అట్టడుగు వర్గాల్లో ప్రభుత్వంపై సానుభూతి ఏర్పడింది.
అన్ని కులాలకు ఆయన పదవులు ఇస్తూ అన్ని కులాల ఓటు బ్యాంకు టీఆర్ఎస్ వైపే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా ఊపందుకున్నాయి. కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోవడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. హైదరాబాద్లోనూ మెట్రో రైలు పరుగులు ఉద్యోగ వర్గాలను టీఆర్ ఎస్కు దగ్గర చేసింది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి చూస్తే.. ఎక్కే గడపా దిగే గడపా అన్నట్టుగానే ఉంది ఇక్కడ నాయకు ల పరిస్థితి కీలకమైన దానం నాగేందర్ వంటి నాయకులు పార్టీ ఝలక్ ఇచ్చారు. ఇక, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం తన పని తాను చేసుకుపోతూ.. రాష్ట్ర చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి మాటలను పెడచెవిన పెడుతోంది. ఇక, సీఎం రేసులో ఉన్న నాయకులు ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తున్నారు. పట్టుమని పదిమంది కూడా ఒకే మాటపై నిలబడి ప్రజల్లోకి వెళ్తున్న దాఖలా కనిపించడం లేదు.
పైగా.. జమిలికి తాము రెడీ కాదని కాంగ్రెస్ నేతలు ప్రకటించడం సంచలనంగా మారింది. ఇదిలావుంటే, ఇక్కడ మరో ప్రత్యామ్నాయం లేదా పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందని భావించిన బీజేపీ నేతలు కూడా ఇప్పుడు మౌనంగా ఉండడం అధికార పార్టీకి కలిసి వస్తున్న పరిణామం. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడే తమకు దిశానిర్దేశం చేస్తారని, తమను నడిపిస్తాడని ఇక్కడ నాయకులు ఎదురు చూపులు చూస్తున్నారు.కేసీఆర్పై నేరుగా విమర్శలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక, టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కాంగ్రెస్తో జట్టు కట్టాలని కొంత సేపు, అలా అయితే, ఏపీలో మొదటికే మోసం వస్తుందని మరికొంత సేపు ఇలా తర్జన భర్జన రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. మొత్తంగా తెలంగాణ పరిస్థితి అధికార పార్టీకి వరంగా మారుతోందని అంటున్నారు విశ్లేషకులు.