అవును, మీరు చదివింది నిజమే. చంద్రబాబునాయుడేంటి ? మాట మీద నిలబడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఆ విషయంపై క్లారిటీ రావాలంటే ఈ కథనం చదవాల్సిందే . ఒకపుడు అంటే బిజెపితో హనీమూన్ బాగా జరుగుతున్న రోజుల్లో ఏపిలో ఎవరైనా ప్రత్యేకహోదా అని అంటే చంద్రబాబు ఉల్లిక్కిపడేవారు. ఒకవైపేమో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హోదా పేరుతో నిరాహార దీక్షలు, ఆందోళనలు, యువభేరీలు నిర్వహించేవారు.
అరెస్టులు చేస్తానన్న చంద్రబాబు
తమపై జగన్ పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక జగన్ సభలకు విద్యార్ధులు హాజరవ్వటం ఇష్టం లేక చంద్రబాబు అరెస్టుల బెదిరింపులకు దిగారు. ప్రత్యేకహోదా ఆందోళనల్లో ఎవరైనా పాల్గొంటే వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పిడి యాక్ట్) క్రింద కేసులు నమోదు చేసి అరెస్టులు చేయిస్తానంటూ బహిరంగంగానే హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు మాటలపై అప్పట్లో పెద్ద గొడవే అయిందనుకోండి అది వేరే సంగతి. సరే, చంద్రబాబు హెచ్చరికలనూ ఎవరూ పట్టించుకోలేదు లేండి.
మాట నిలుపుకున్న సిఎం
హెచ్చరికలైతే చేశారు కానీ అరెస్టులు చేసే ధైర్యం చేయలేకపోయారు. కానీ ఇపుడు అవకాశం వచ్చింది. అందులోనూ ఎన్నికల ముందు. ఇచ్చిన హామీని, మాటను నిలుపుకునే అలవాటు చంద్రబాబుకు లేదని ఒకవైపు వైసిపి నేతలు తరచూ ఆరోపిస్తుంటారు. అందుకనే తన మాట నిలుపుకోవాలని అనుకున్నట్లున్నారు. ఈరోజు బంద్ లో పాల్గొంటున్న వైసిపి మాజీ ఎంపిలు, ఎంఎల్ఏలు, నేతలు, కార్యకర్తలను కూడా వదలకుండా కొన్ని వేలమందిని అరెస్టులు చేయించారు. అంటే తాను చెప్పిన మాటను చంద్రబాబు నిలుపుకున్నట్లే కదా ? ఏమంటారు ?