ఇద్దరు ఎంఎల్ఏలకు, ఒక నియోజకవర్గ ఇన్చార్జికి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏలకు తిరిగి టిక్కెట్టు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అదే విధంగా నియోజకవర్గంలో ఇంతకాలం పనిచేస్తున్న ఇన్చార్జికి కూడా టిక్కెట్టు ఇవ్వటం లేదని స్పష్టం చేశారట. దాంతో ఆ ముగ్గురు చంద్రబాబుపై మండిపోతున్నారు. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి ? ఏంటి అంటే ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డే కారణమట. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలంటే మాగుంట ఓ కండీషన్ పెట్టారట. దానికి సిఎం ఒప్పుకున్నారట. అదే ఇపుడు జిల్లా రాజకీయాల్లో చిచ్చుకు కారణమైంది.
మాగుంట షరతులకు లొంగిన చంద్రబాబు
ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని పోటీలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకు మాగంట ఒప్పుకోవటం లేదు. అయితే, చంద్రబాబు నుండి ఒత్తిడి వస్తున్న కారణంగా చివరకు ఒప్పుకున్నారు. అయితే తాను పోటీ చేయాలంటే...ఓ కండీషన్ పెట్టారట. ఇంతకీ ఆ కండీషన్ ఏమిటంటే, జిల్లాలో పార్లమెంటు పరిధిలోకి వచ్చే కనిగిరి, యర్రగొండపాలెం ఎంఎల్ఏలు కదిరి బాబూరావు, డేవిడ్ రాజులకు టిక్కెట్లు ఇవ్వకూడదని మాగుంట షరతు విధించారట. అంతేకాకుండా మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డికి టిక్కెట్టు ఇవ్వకూడదని చెప్పారట.
మాగుంట చెప్పిన వారికే టిక్కెట్లా ?
ఒంగోలు ఎంపి స్ధానంలో గట్టి అభ్యర్ధిని పోటీలోకి దింపే ఉద్దేశ్యంతో ఉన్న చంద్రబాబు మాగుంట షరతులకు ఒప్పుకున్నారట. వారి స్దానాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని మాగుంట పెట్టిన కండీషన్ కు కూడా చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. తర్వాత అదే విషయాన్ని జిల్లా సమీక్ష సందర్భంగా వారికి చంద్రబాబు వివరించారట. అప్పటి నుండి పై ముగ్గరు నేతలు చంద్రబాబుతో పాటు మాగుంటపై మండిపడుతున్నారు. మాగుంట మాట విని సిట్టింగులమైన తమను పోటీలో నుండి తప్పించటమేంటని చంద్రబాబును నిలదీశారని సమాచారం. పై ఇద్దరి ఎంఎల్ఏల్లో డేవిడ్ రాజు ఫిరాయింపు ఎంఎల్ఏ కావటం గమనార్హం.
చంద్రబాబుపై మండిపోతున్న నేతలు
మాగుంట పెట్టిన తాజా చిచ్చు జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. సిట్టింగులైన తమను కాదని ఇంకోరికి టిక్కెట్లిస్తే తాము సహించేది లేదన్నారు. కనిగిరి ఎంఎల్ఏ కదిరి బాబురావు సిఎం బావమరది, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు బాగా సన్నిహితుడన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ కారణంగానే బాబురావుకు టిక్కెట్టు దక్కుతోంది. మరి, మాగుంట షరతులతో జిల్లా రాజకీయాలు ఏం మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.