సాధారణంగా కొన్ని సినిమాల్లో పోలీసులు దొంగతనాలు చేయడం చూపిస్తుంటారు.. అలాంటి సన్నివేశాలు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి.  తాజాగా దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ అధికారిణి ఏకంగా దొంగ అవతారం ఎత్తింది. ఓ సూపర్ మార్కెట్ లోని వస్తువుల్ని ఎంచక్కా జేబులో దాచుకోవడం మొదలు పెట్టింది. ఈ తతంగాన్ని గమనించి నిలదీసిన ఆ సంస్థ ఉద్యోగి వస్తువుల్ని వెనక్కు ఇవ్వాలని కోరడంతో కోపంతో రెచ్చిపోయిన ఆమె తన భర్తతో చావగొట్టించింది. 

ఈ ఘటన తమిళనాడులో  చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే చెట్ పేట్ లోని ఓ సూపర్ మార్కెట్ కు బుధవారం ఓ మహిళా కానిస్టేబుల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడుతూ షాపులోని ఒక్కో వస్తువును జేబులో దాచుకోవడం మొదలుపెట్టింది. దీన్ని అక్కడే పనిచేస్తున్న ప్రణవ్ అనే ఉద్యోగి గమనించాడు.  వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చోరీ చేసిన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరాడు. అంతేకాకుండా తప్పు చేసినట్టు క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలన్నాడు. 

దాంతో అవమానంగా ఫీల్ అయిన ఆ మహిళా పోలీసు తన భర్తకు విషయం చెప్పడంతో అతను మరికొందరిని తన వెంట వేసుకొని సూపర్‌ మార్కెట్‌పై దాడి చేశాడు. ప్రణవ్‌ను ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ ప్రణవ్ ను సూపర్ మార్కెట్ లోని సహోద్యోగులు ఎలాగోలా రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: