వైసీపీ అధినేత ఓ విషయంలో విఫలమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది కూడా సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా కౌంటర్ ఇవ్వలేక పోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీ యాలు అనూహ్యంగా మారుతున్నాయి. చాపకింద నీరులా చంద్రబాబు పొత్తు రాజకీయాలకు తెరదీశారు. అది కూడా కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన టీడీపీని పోయి పోయి ఆయన కాంగ్రెస్ చేతుల్లోనే పెడుతుండడం టీడీపీని అభిమానించే నాయకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. నిజానికి ఇది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకం. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడమే పరమావధిగా చంద్రబాబు ఈ వికృత పొత్తుకు తెరదీశారు.
దీనికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి. మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికలకు ముందుగానే తెరచాటుగా ఆయన కాంగ్రెస్తో చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే ప్రధాన అజెండాతో ఆయన ముందుకు సాగడం వెనుక పరోక్షంగా కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చాలని అడుగులు వేశారు. ఇక, పార్లమెంటులో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమో డీ సర్కారుపై అవిశ్వాసం ప్రకటించడం వెనుక కూడా కాంగ్రెస్ మద్దతును కూడగట్టారు. ఇక, పార్లమెంటు పీఏసీ సభ్యుడిగా కడప జిల్లాకుచెందిన ఎంపీ సీఎం రమేష్ ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్తో ఆయన జట్టుకట్టారు. ఈ పరిణామాలను జగన్ తనకు అనుకూలంగా మలుచుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
కాపుల ఉద్యమం జరిగిన సమయంలో తుని సంఘటనను వైసీపీకి ముడి పెట్టడంలో టీడీపీ అధినేతగా బాబు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఎలాంటి సంబంధమూ లేకపోయినా ముద్రగడ పద్మనాభంతోనూ వైసీపీ అంటుకాగుతోందని చేసిన ప్రచారమూ దుమ్మురేపింది. ఇక, నిన్న మొన్నటి వరకు బీజేపీతో జగన్ అంటకాగారంటూ.. చేసిన ప్రచారం కూడా దుమ్మురేపింది. మరి ఇప్పుడు అవకాశం ఉండి కూడా జగన్ ఎందుకు టీడీపీని విమర్శించలేక పోతున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.
చేతిలో మీడియా ఉండి, పత్రిక ఉండి కూడా జగన్ .. చంద్రబాబును ఆశించిన స్తాయిలో బద్నాం చేయలేక పోతున్నారని వైసీపీ సీనియర్లే అంటున్నారు. ఈ పరిణామాలను వైసీపీలోని ఓ వర్గం సహించలేకపోతోంది. కేవలం పాదయాత్ర చేయడం ద్వారా నే జగన్ అనుకున్న లక్ష్యం సాధిస్తాడనే నమ్మకం ఉన్నప్పటికీ.. దీనికి అనుకూలంగా బాబు చేస్తున్న వ్యవహారాలను సైతం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల్సి న అవసరం ఉందని అంటున్నారు. మరి జగన్ ఇప్పటికైనా ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.