భారత దేశంలో హిందు సాంప్రదాయం ప్రకారం... శ్రాణమాసంలో అనగా జూన్ నుంచి ఆగష్టు మధ్య పౌర్ణమి రోజుల అనురాగ బంధాల ప్రతీక అయిన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ పండుగను మన దేశవ్యాప్తంగా , సోదరులు మరియు సోదరిమణులు మధ్య ప్రేమ మరియు ఆప్యాయతకు గుర్తుగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను రక్షా బంధన్ అని పిలుస్తారు. రక్షా అంటే రక్షణ, బంధన్ అంటే బంధం అని అర్ధం. సకల వేళల తమకు రక్షణగా నిలువాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరుల ముంజేతికీ రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. అదే విధంగా సోదరుడు రాఖీ కట్టిన చెల్లిని ఏ సమస్యలు రాకుండా... జీవితాంతం రక్షగా ఉంటానని భావించే పండుగగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు.
రాఖీ పౌర్ణమి పూర్వపు చరిత్ర...
వాస్తవానికి దేశంలో రాఖీ పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమైందో , దానికి ఎందుకు ఇంతగా ప్రాముఖ్యత ఏర్పడిందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాధారాలు లేవు కానీ.... పురాణాలలో తెలిపిన విధంగా... వివిధ రకాల కథలు మాత్రం ఉన్నాయి. అన్న చెల్లెలైనా ద్రౌపది-శ్రీకృష్ణుడికి అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తోంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామి ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి అమెను కాపాడుతాడు. దీంతో అన్నా చెల్లెళ్ల బంధం గొప్పదిగా భావిస్తూ రాఖీ పౌర్ణమి ని జరుపుకుంటారు. ఇక మరో చరిత్ర కూడా ఇదే బంధాన్ని చూపిస్తుంది.
అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని రాఖీ కట్టింది...
అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుందట. జగవిజేతగా మారాలనే తపనతో ఉన్న గ్రీకు వీరుడు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 325 లో భారతదేశంపై దండెత్తుతారు. ఈ క్రమంలో నేటి అఫ్ఘనిస్థాన్ నాటి బాక్ట్రియా గా పిలువబడే దేశానికి చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య అసియా దేశాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్ ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్దానికి సిద్దమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడని చంపవద్దని తన భర్త అలెగ్జాండర్ ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ యుద్దం విరమించుకుంటాడు. చరిత్రలు ఏవైనప్పటికీ మనవతా విలువలు మంటగలుస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో రాఖీ పౌర్ణమి తన విశిష్టతను చాటి చెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహద పడుతుంది.
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు మధ్య ప్రేమానురాగాలు...
ఇలా చెప్పుకుంటూ పోతే రాఖీ పౌర్ణమికి చాలా చరిత్రలే ఉన్నాయి. అయితే గతంలో జరిగిన ఏ చరిత్రలు చూసినా సోదర భావంతో పంపిన రాఖీలు యుద్దాలను ఆపాయి. రక్తపాతాన్ని నివారించాయి. రాజ్యాలు కూలిపోకుండా చేశాయి. సరికొత్త అనుబంధాలను సృష్టించాయి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు శుభ సూచకంగా జరుపుకునే పండగను మరి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేక జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మాత్రమే ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా విస్తరించింది. నాటి అలెగ్జాండర్ నుంచి నేటి మొఘల్ చక్రవర్తి వరకు రాఖీ పండగలు జరుపుకునేవారని చరిత్రలు చెబుతున్నాయి.
కానీ తాజాగా రక్షా బంధన్ పవిత్రత కాలంతో పాటు మారిపోయింది. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా జరుపుకోవడం ఆరంభమైంది . ప్రేమా... గీమా అంటూ వెంటపడే వారిని వదిలించుకోవడానికి అన్నా అంటూ బహుమతులను ఒడిసి పట్టేందుకూ పొడి పొడి అప్యాయతలు రాఖీలతో వ్యక్త పరచడం వాడుక గా మారింది. నేటి యువతకు హృదయ పొరల్లో ఉండే అర్దరహిత ప్రేమను చూపించడం కోసం ఓ సంప్రదాయంగా మాత్రమే రక్షా బంధన్ మారడం నిజంగా విచారకరం.