చంద్రబాబునాయుడు పాలనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం తరచూ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎందుకిలా జరుగుతోందో అర్ధం కావటం లేదు. ఏదో కార్యక్రమం పెట్టుకోవటం అది విఫలమవ్వగానే వెంటనే ఆ నెపాన్ని ప్రధాన ప్రతిపక్షం వైసిపి మీదకు నెట్టేసి చేతులు దులిపేసుకోవటం మామూలైపోయింది. తాజాగా టిడిపి నిర్వహించిన నారా హమారా..టిడిపి హమారా అంటూ ముస్లింలను ఆకట్టుకునేందుకు టిడిపి భారీ బహిరంగసభ నిర్వహించింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కూడా కొందరు ముస్లిం యువకులు నినాదాలు చేయటంతో సమస్య మొదలైంది.
యువకుల డిమాండ్ లో న్యాయముందా ?
సభలో యువకులు చేసిన నినాదాలు ఏమిటి ? ఎందుకు అలా చేశారు ? వారి నినాదాల్లో ఎంత వరకూ న్యాయముంది అన్నది వేరే సంగతి. కానీ టిడిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలో అంతమంది ముస్లిం యువకులు హటాత్తుగా నినాదాలు ఎలా ఇవ్వగలిగారు ? చంద్రబాబు వైఫల్యాలను రాసున్న ప్ల కార్డులను సభలో ఎలా ప్రదర్శించగలిగారు ? ఆ ప్ల కార్డులను సభలోకి తెస్తున్నపుడు పోలీసులు ఏం చేస్తున్నట్లు ? ఇదంతా పోలీసులు ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా ?
ఇంటెలిజెన్స్ విభాగమే కళ్ళు, చెవులు
ఏ ప్రభుత్వానికైనా ఇంటెలిజెన్స్ విభాగమన్నది కళ్ళు, చెవులాంటిది. ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో సిఎంకు అందచేస్తూ అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగానిదే. అంటే తన బాధ్యతల్లో ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమవుతున్న విషయం స్పష్టంగా అర్దమవుతోంది. . ఇప్పుడే కాదు గతంలో ఓటుకు నోటు కేసు తర్వాత వెలుగు చూసిన టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా బయటపడింది.
వైఫల్యాలను వైసిపి కి అంటకడుతున్నారు
ఎవరి విధులను వారిని నిర్వర్తించనిస్తే ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి ? ఇంటెలిజెన్స్ అన్నది చంద్రబాబు జేబు సంస్దగా మారిపోయింది. అందుకనే అందరూ చంద్రబాబు భజనలో ముణిగిపోతున్నారు. చంద్రబాబు భజనలో ముణిగిపోతున్నా కాబట్టి క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతోందో వాళ్ళకి అర్ధం కావటం లేదు. తమ వైఫల్యాన్ని వైసిపి మీదకు నెట్టేయటంతో బాధ్యతల నుండి తప్పుకుంటున్నారు.