సరిగ్గా గమనిస్తే చంద్ర బాబు కు మరియు మోడీకి ఒక సారూప్యత కనిపిస్తుంది. చంద్ర బాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు అతని పేరు వాడుకుంటున్నాడు. అటల్ బిహారీ వాజ్ పేయి పేరుని వాడుకుని ప్రధాని మోడీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. రెండుచోట్లా పార్టీ సిద్ధాంతాలకు వీళ్లిద్దరూ తూట్లుపొడిచేశారు. బతికుండగానే వారి భావజాలాన్ని తొక్కిపెట్టి, చనిపోయాక పూర్తిగా వారి పేరుని వాడుకుంటున్నారు.
ఇప్పుడిప్పుడు నారా హమారా అంటూ చంద్రన్న బీమాలంటూ తన పేరుని బైట పెట్టుకుంటున్నారు కానీ, ఎన్టీఆర్ పేరు లేనిదే, ఆయన పేరు చెప్పుకోనిదే ఓట్లు రాలవని బాబుకి బాగా తెలుసు. అందుకే అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ భార్య పేరుమీద బసవతారకం మదర్ కిట్లు.. ఇలా రకరకాల వేషాలు వేస్తున్నారు. పార్టీలో ఆయన పేరు వినిపిస్తున్నా, పార్టీ వేదికలపై ఆయన విగ్రహం కనిపిస్తున్నా... ఆయన సిద్ధాంతాలకి మాత్రం బాబు ఏనాడో తూట్లు పొడిచేశారు.
ఇక కేంద్రం విషయానికొస్తే.. ఉదారవాదిగా మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయికి పేరుంది. కానీ మోదీ చేస్తున్నదేంటి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నదేంటి. అతివాదం, నరమేథం. పాకిస్థాన్ కి సైతం స్నేహ హస్తం అందించగల సామరస్య హృదయం ఉన్ననేత వాజ్ పేయి. కానీ సొంత దేశంలోనే సోదర భావం మధ్య చిచ్చుపెట్టిన నేత మోదీ. బీజేపీ అధికారంలో ఉన్నచోట మైనార్టీలపై జరుగుతున్న దాడులు వాజ్ పేయి సిద్ధాంతాలకు ఏమాత్రం సరిపడవు. ఆయనే బతికుంటే ఇలాంటి వాటిని పూర్తిగా ఖండించేవారు, దురదృష్టవశాత్తు మోదీ గద్దెనెక్కక ముందు నుంచీ ఆయన అచేతనంగా ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా మననుంచి దూరమయ్యారు.