చంద్రబాబునాయుడును పట్టుకుని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దుమ్ము దులిపేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై విచారణకు తాను సిద్ధమంటూ సవాలు విసిరారు. చంద్రబాబు కానీ లేకపోతే సిఎం తరపున ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావైనా పర్వాలేదన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంలోని పలు తప్పులను ఎత్తిచూపుతూ ముఖ్యంగా ఐదు అంశాలపై నిలదీశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి బాండ్లు జారీ చేయటం, లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రావటం, ఇళ్ళ నిర్మాణం, పోలవరంలో అవినీతి, హెరిటేజ్ సంస్ధ వల్ల మూతపడ్డ ఇతర డైరీలు తదితర అంశాలపై సూటిగా చంద్రబాబునే నిలదీశారు. ఉంవల్లి పదే పదే సవాళ్ళు విసురుతున్నా టిడిపి నుండి మాత్రం ధీటైన జవాబు రాకపోవటం విచిత్రంగా ఉంది.
జీవోలను ఉల్లంఘిస్తున్న చంద్రబాబు
రాజధాని నిర్మాణానికి 10.36 అధిక శాతం వడ్డీకి అప్పులు తేవటాన్ని తప్పుపట్టారు. 8 శాతానికి మించి వడ్డీకి అప్పులు తీసుకొచ్చేందుకు లేదని ప్రభుత్వమే గతంలో జీవో ఇచ్చి అదే జీవోను మళ్ళీ ప్రభుత్వమే ఉల్లంఘించటాన్ని ఉండవల్లి ఎత్తి చూపారు. అధిక వడ్డీకి అప్పులు తేవటం కూడా చంద్రబాబు గొప్పదనమేనా ? అంటూ అడిగారు. ప్రభుత్వ అవినీతిని వెనకేసుకొస్తున్న కుటుంబరావుపై కూడా ఉండవల్లి ధ్వజమెత్తారు. ఆర్ధికవేత్తగా మాత్రమే మాట్లాడాల్సిన కుటుంబరావు పార్టీ నేతగా మాట్లాడటమేంటంటూ మండిపడ్డారు.
ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎంపిలే చెబుతున్నారు
అదే సమయంలో రూ. 18 లక్షల కోట్ల విలువైప పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయని చెప్పటం కూడా తప్పన్నారు. ఒకవైపు చంద్రబాబు 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెబుతుంటే పార్లమెంటులో రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ మాట్లాడుతూ, ఏపికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పదే పదే చెప్పటాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. చంద్రబాబు, రాజ్యసభ సభ్యులు చెప్పిందాట్లో ఎవరు చెప్పింది నిజమని ఉండవల్లి నిలదీశారు. ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా అవినీతితోనే సాగుతోందన్నారు. ప్రభుత్వం చెబుతున్న లక్షలాది ఇళ్ళ నిర్మాణంలో కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు తనకు అనుమానంగా ఉందన్నారు. హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని ఎన్నో ఫ్యాక్టరీలు మూత పడటానికి కారణమేంటని ప్రశ్నించారు.