ఈ మద్య సోషల్ మీడియాలో కొత్త సర్వే ఒకటి హల్-చల్ చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఖరారు అయిన నేపథ్యంలో, ఇక్కడ గెలుపెవరిది? ఓటమి ఎవరిది? అనే అంశం గురించి ఈ సర్వే ఒకింత ఉత్సుకత అంతకు మించి సంచలనం రేపింది. ఇది ఆంధ్ర ఆక్టోపస్ అనే లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వే అని కూడా ప్రచారం జరుగుతోండి. ఆయన చేయించాడో? లేక ఈ సర్వేను ప్రచారంలో పెట్టడానికి ఆయన పేరును వాడుకున్నారో? తెలియదు. కానీ, కేసీఆర్ టిఆరెస్ పార్టీ చిత్తు చిత్తు అవు తుందని మాత్రం ఈ సర్వే చెబుతోంది.
మొత్తం 119 సీట్లున్న తెలంగాణలో త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో తెరాసకు దక్కేవి కేవలం 39 సీట్లే అని ఈ సర్వే తేల్చిందట. ఇంతకీ మెజారిటీ సీట్లు ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీకే అని ఈ సర్వే చెప్పిందట. మొత్తం 61 ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీస అవసరం 60ఎమ్మెల్యే సీట్లు కాగా, కాంగ్రెస్ పార్టీకి మినిమం మెజారిటీ కన్నాఒక్క సీటు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది.
ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే, ఎంఐఎం తన ఏడు సీట్లను నిలబెట్టుకుంటుందని, తెలుగు దేశం పార్టీ మూడు సీట్లకు పరిమితం అవుతుందని, బీజేపీది కూడా అదే పరిస్థితి అని ఈ సర్వే చెబుతోంది. సీపీఐ రెండు సీట్లు, సీపీఎం ఒక్క సీటు నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే అభిప్రాయ పడింది. ఇక కోదండరాం పార్టీకి మూడు సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ నంబర్లు అయితే బాగానే ఉన్నాయి కానీ, ఈ సర్వే నిజంగానే జరిగిందా? లేక ఊరికే ప్రచారంలోకి పెట్టారా? అనేది సందేహం. ఈ సర్వే నిజం అయితే అవి సంచలన ఫలితాలే!
అందుకే కేసీఆర్, కేటీఆర్లపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ సన్యాసం తీసుంటారని, కేటీఆర్ అమెరికా వెళతార ని జోస్యం చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, సీపీఐలతో పొత్తులపై చర్చించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణను రక్షించుకునేందుకు "కామన్ మినిమమ్ ప్రోగ్రామ్" తో వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొత్తులో సీట్ల సర్దుబాటుపై చర్చించలేదని ఉత్తమ్ పేర్కొన్నారు.
కొండగట్టు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీచర్లను కేసీఆర్ నాలుగున్నర ఏళ్లుగా మోసం చేశారని మండిపడ్డారు. తాము అధికారం లోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. పే రివిజన్ కమిషన్ను అమలు చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీ ప్రకటించి 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. అలాగే 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.