తాత్కాలిక సచివాలయం నిర్మాణాల ముసుగులో భారీ దోపిడి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) దుమ్ము దులిపేసింది. రాజధాని ప్రాంత వ్యవహారాలు చూసే సిఆర్డిఏ లెక్కలపై 2017-18 ఆర్దిక సంవత్సరాలపై మొదటిసారి కాగ్ ఆడిట్ చేసింది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చూసినా సుమారు 40 కోట్ల రూపాయలు దోపిడి జరిగిందని కాగ్ నిగ్గు తేల్చింది. తాజాగ కాగ్ నివేదికతో ఇంతకాలం ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజాలే అన్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. దోపిడికి లాకులెత్తే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టేసిందంటూ కాగ్ తలంటిపోసింది.
కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం నిబంధలను రూపొందించినట్లు కాగ్ స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లకు అంతులేని ప్రయోజనం కలిగించేందుకని ప్రభుత్వం ఖజానాకే చిల్లుపెట్టిందని చెప్పింది. భవనాల నిర్మాణం విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కిందని తేల్చేసింది. ప్రభుత్వం చేసిన పని వల్ల కాంట్రాక్టర్లు సుమారు రూ. 40 కోట్ల లాభపడినట్లు వ్యాఖ్యానించింది.
తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు కావాలనే ఎక్సెస్ రేటు కోట్ చేసినా ప్రభుత్వం సంప్రదింపుల ద్వారా రేటును తగ్గించేట్లు చేయటంలో విఫలమైందని తప్పుపట్టింది. పైగా సంప్రదింపులు జరిపినా 80 శాతం ఎక్సెస్ 25 శాతానికి ఒప్పుకోవటంలో అర్ధమేలేదని చెప్పింది. సరే, ఇదే విధంగా కాగ్ చాలా అంశాల్లో ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పుపట్టింది లేండి. నిజానికి తాత్కాలిక భవనాల నిర్మాణం పేరుతో ప్రభుత్వం చెల్లించిన ప్రతీ రూపాయి కూడా ప్రజాధనమే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే అవసరాలకోసం ఎక్సెస్ చెల్లించిందనే అనుకున్నా, కట్టిన భవనాలన్నీ నాసిరకమే అన్న విషయం బయటపడింది. అంటే అంత నాసిరకం నిర్మాణాల్లో కూడా ప్రభుత్వం ఏ స్ధాయిలో దోపిదికి దిగిందో అందరికీ అర్ధమైపోతోంది.