రాష్ట్ర విభజన ఫలితంగా కాంగ్రెస్ ఏపీలో తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏదో విధంగా కష్టపడి పార్టీని బతికించుకునేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అవి ఎక్కడా ఫలించడం లేదు. ఏపీలో కాంగ్రెస్ చాలా వీక్గా ఉన్నప్పటికీ.. బలమైన పక్షంగా ఉన్న టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోగా.. తెలంగాణాలో మాత్రం అత్యంత వీక్గా ఉన్నటీడీపీని చంకలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుండడం నాయకులను విస్మయానికి గురి చేస్తోంది. ఇక, ఏపీలో పాతకాపులకు పెద్ద పీట వేస్తామని ప్రకటించి నాలుగు మాసాలు గడిచిపోయింది. కానీ, ఇప్పటికీ ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ గూటికి వచ్చి చేరింది లేకపోగా.. కోండ్రు మురళి వంటి మాజీ మంత్రి మాత్రం మళ్లీ టీడీపీ కండువానే కప్పుకొన్నారు.
ఇక, ఎన్నికలు సమీపించేసరికి కళ్లకు కమ్ముకున్న అధికారపు పొరలు నెమ్మదిగా విచ్చుకుని.. మళ్లీ రాష్ట్ర ప్రజలు, వారికి జరిగిన అన్యాయం గుర్తుకొస్తోందా అని కాంగ్రెస్ చంద్రబాబును ప్రశ్నిస్తున్నా.. ప్రజల్లో ఇలాంటి విమర్శలను పట్టించుకునే నాధుడు ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి ఏపీ శాసనసభలో ప్రధాని మోడీని, బీజేపీ నాయకులను కీర్తిస్తూ గత నాలుగేళ్లుగా కీర్తిగీతాలు ఆలపించారు చంద్రబాబు. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల నాడిని పసిగట్టి.. ఈ రోజు అదే నోటితో తిట్టు కవిత్వాలు వినిపిస్తున్నారు. నాలుగేళ్లు మోడీతో అంటకాగి ఆకాశంలో విహరించిన బాబు ఎన్నికల పుణ్యాన భూమి మీదకు దిగక తప్పలేదు. అయితే, దీనిని కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడంలోను, బాబు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడంలోను కూడా కాంగ్రెస్ విఫలమైందని సొంత పార్టీ సీనియర్లే ఆఫ్దిరికార్డుగా ఒప్పుకొంటున్నారు.
మేమొస్తే.. హోదా ఇస్తాం. హోదాపైనే నా తొలి సంతకం అని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను సైతం ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కాంగ్రెస్ ఏపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యే కహోదా గురించి ఆలోచించడం మానేసి.. ఆ బాధ్యత కాంగ్రె్సకు వదిలిపెట్టాలని అంటున్నా.. నాయకులను పిలుపును ప్రజలు అర్ధం చేసుకునే పరిస్తితి మాత్రం కనిపించడం లేదు. రఘువీరా కానీ, కేవీపీ రామచంద్రరావు కానీఔడేటెడ్ రాజకీయాలతోనే నెట్టుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ చేయడాన్ని కూడా కాంగ్రెస్ మేధావులు తమకు అనుకూలంగా మార్చుకోలేక పోయారు. దీనిపై ప్రజల్లో చర్చను లేవనెత్తడంలోనూ విఫలమయ్యారు. మరి ఇంతగా వెనుకబాటులో ఉన్న నాయకులు ఎన్నికల్లో ఏం సాధిస్తారో వారికే తెలియాలి!