రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పడం కష్టం. నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకున్న వా రు సైతం ఇప్పుడు ఒకే వరలో ఇమిడిపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇలాంటి పరిస్థితులు ఎదు రైతే.. ప్రదాన పార్టీలకు మేలు జరుగుతుందా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఇలాంటి రాజకీయమే ఏపీలో నూ చోటు చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు తీవ్రస్థాయిలో తిట్టిపోసుకున్న జనసేనాని పవన్-వైసీపీ అధినేత జగన్లు ఏకమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇటీవల ఓ సభలో పవన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. తనకు జగన్ శత్రువు కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. నిజానికి పవన్ వ్యక్తిగత విషయాలపై విరుచుకుపడ్డ జగన్పై రెండు మాసాల కిందట తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
పవన్ను నిత్య పెళ్లికొడుకు అంటూ జగన్ విమర్శించారు. దీంతో జనసేన కార్యకర్తలు, నాయకులు సైతం విమర్శించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య అగాధం పెరుగుతుందని అనుకున్నారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మద్య మళ్లీ సయోధ్యకు అవకాశం కుదిరేలా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో ఈ ఇద్దరు కలిసిపోతే.. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి చుక్కలు కనిపించడం ఖాయమా? మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నచంద్రబాబుకు ఆ ఆశలు నెరవేరుతాయా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే విష యంపై తాజాగా మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు.
ఏపీలో వైసీపీ, జనసేన అధ్యక్షులు జగన్, పవన్ కల్యాణ్ చేతులు కలిపితే తెలుగుదేశం ప్రభంజనం వీస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. ఆ ఇద్దరూ కలిస్తే తెలుగుదేశం నెత్తిన పాలుపోసిన వారవుతార ని, తెలుగుదేశం 150 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపారు. ‘జగన్, పవన్.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం 174 సీట్లలో విజయం సాధిస్తుంది. ఒక్క పులివెందుల విషయంలోనే కొంచెం డౌట్’ అని చమత్కరించారు.
రాజకీయాల్లో అవసరార్థం కలిసేవారిని జనం ఆదరించరని చెప్పారు. వన్ ప్లస్ వన్ అంటే టు అనేది రాజకీయాలకు వర్తించదని అభిప్రాయపడ్డారు. జగన్ నేతృత్వంలో ప్రతిపక్షం అనేది అర్థం కోల్పోయిందని, ఆయన మాట్లాడే మా టలకు విలువ లేకుండా పోయిందని చెప్పారు. మరి ఇప్పుడు లోకేష్ చెబుతున్న జోస్యం ఫలిస్తుందా? ఆయన ఎలాంటి ఈక్వేషన్లను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.