ఎన్నికలకు-విద్యార్థులకు ఇప్పుడు అవినాభావ సంబంధం పెరిగిపోయింది. గతానికి భిన్నంగా ఇప్పుడు ఎన్నికల్లో వి ద్యార్థులు పోటీకి సై! అంటున్నారు. అంతేకాదు, తమ అండ లేకుండా ఏ ఒక్కనాయకుడు గెలవలేని పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటి సమైక్య ఉద్యమంతో ఏర్పాటైన రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ వం టి యూనివర్సిటీల విద్యార్థుల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చున్న సందర్భంలోను, ఆ తర్వాత అర్ధరాత్రి పూట ఆయన దీక్షను విరమించేందుకు చేసిన ప్రయత్నం సందర్భంలోను విద్యార్థులు తమదైన శైలిలోస్పందించారు. చాలా మంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం కూడా చేశారు.
ఇక, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కేసీఆర్కు అడుగడుగునా వారు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్పుల మొదలుకుని, ప్రభుత్వ పథకాల వరకు కూడా వారు ప్రశ్నించారు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడాఉస్మానియా విద్యార్థులు ప్రభుత్వంపైనా, కేసీఆర్ పైనా కత్తికట్టు వ్యవహరిస్తూనే ఉన్నారు. తమకు ముందస్తు ఎన్నికల ముచ్చటలో చోటు కల్పించాలనేది, టికెట్లు ఇవ్వాలనేది వీరి ప్రధాన డిమాండ్గా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో విద్యార్థులు రెండుగా చీలిపోయి.. కేసీఆర్కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటామని అంటున్నారు.
ఉస్మానియా విద్యార్థులదే పోరాటమా..? కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు చేసింది పోరాటం కాదా..? అని వరంగ ల్లోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ దీక్ష తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాజేసింది కాకతీయ విద్యార్థులేనన్నది మరచిపోవద్దని పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ పట్టించుకో కపోతే తాము స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతామని విద్యార్థి జేఏసీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. ఈ పరిణామం ఎన్నికల ముంగిట తీవ్ర ప్రకంపనలే రేపుతోంది. ఒకపక్క మహాకూటమితో ఓట్లు చీలే అవకాశం.. మరోపక్క, విద్యార్థులు కడుతున్న కత్తులతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి కాక తప్పదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని భావించినా.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిణామాలు తీవ్రంగా మారుతుండడంతో కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.