తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల సెగ మొదలైంది. గెలుపు లక్ష్యంగా ఇక్కడ ప్రదాన పార్టీలు ప్రచార హోరులో మునిగిపోయారు. వచ్చే నెలలో ఎన్నికలు జరుపబోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు గత నెల నుంచి ప్రచారం షురూ చేశారు. ఇక టీ కాంగ్రెస్, టిటిడిపి, టిజెఎస్, సిపీఐ కూటమిగా మారబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికల సభల్లో ప్రత్యర్థులపై పరుష పదజాలంతో తీవ్రమైన విమర్శలు చేసిన టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు ఈసీ షాకిచ్చింది.
48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల్లో తమపై సానుభూతి కలిగే విధంగా ప్రత్యర్థులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎన్నికల చట్టంలో తప్పుగా పరిగణించబడుతారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్రావుతో పాటు రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్రెడ్డిలకు కూడ ఈసీ నోటీసులను శుక్రవారం నాడు జారీ చేసింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డిలకు ఈసీ నోటీసులు ఇచ్చింది.