అత్యంత ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో 1917 నవంబర్ 19న జన్మించిన శ్రీమతి ఇందిరాగాంధీ స్వతంత్య్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. ఇకోలే నౌవెల్, బెక్స్ (స్విట్జర్లాండ్) ఇకోలే ఇంటర్నేషనల్ – జెనీవా, ప్యూపుల్స్ ఓన్ స్కూల్ – పూనె, బొంబే, బాడ్మింటన్ స్కూల్ – బ్రిస్టల్, విశ్వభారతి, శాంతినికేతన్, సోమర్ విల్ కాలేజ్ – ఆక్స్ ఫర్డ్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఆమె చదువుకున్నారు. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు పొందారు. ప్రముఖ విద్యా సంస్థల నుంచి విద్యను అభ్యసించిన నేపథ్యం కలిగిన ఇందిరాగాంధీ కొలంబియా యూనివర్శిటీ నుంచి విశిష్ట ప్రశంసా పత్రం అందుకున్నారు. తన బాల్యంలో స్వాతంత్ర ఉద్యమంలో సైతం పాల్గొన్నారు.
1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి సహాయంగా ఉండేందుకు పిల్లలతో కలసి ‘వానర్ సేన’ ఏర్పాటుచేశారు. 1942 సెప్టెంబర్లో జైలుకు వెళ్ళారు. 1947లో ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఇందిరాగాంధీ 1942 మార్చి 26న ఫిరోజ్గాంధీని వివాహమాడారు. ఆమెకు ఇద్దరు కుమారులు. 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ ఎన్నికల కమిటీలలో సభ్యురాలిగా నియమితులయ్యారు. 1958లో కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఏఐసిసి జాతీయ సమగ్రతా మండలి ఛైర్ పర్సన్గాను, 1956లో అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గాను పనిచేశారు.
1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి 1960 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత అత్యున్నత ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. ఇదే కాలంలో 1967 సెప్టెంబర్ నుంచి 1977 మార్చి వరకు అణు ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. 1970 జూన్ నుంచి 1973 నవంబర్ వరకు హోం మంత్రిత్వశాఖకు నాయకత్వం వహించారు. 1972 జూన్ నుంచి 1977 మార్చి వరకు అంతరిక్ష వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1980 జనవరి నుంచి ప్రణాళికా సంఘం ఛైర్ పర్సన్గా వ్యవహరించారు. 1980 జనవరి 14న మళ్ళీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. విభిన్నమైన విస్తృతాంశాల పట్ల ఆసక్తి కలిగిన ఇందిరాగాంధీ జీవితం పట్ల సమగ్ర దృక్పథం కలిగి ఉండేవారు. కార్యకలాపాలు, వివిధ రకాల ఆసక్తులను వేరువేరుగా కాక మొత్తంగా రంగరించి ఆచరించడంలో తనదైన ప్రత్యేకతను ఇందిరాగాంధీ చాటుకున్నారు.