రాష్ట్రంలో తాను ఏం చేసినా.. అంతా ప్రజల మంచికేనని డబ్బా కొట్టే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా అవినీతి పరుల గుండుల్లో రైళ్లు పరిగెట్టించే సీబీఐని రాష్ట్రంలో నిషేధించారు. ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారంతో ఆయన చేసిన ఈ రద్దు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు నిర్లజ్జగా తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుం టోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం నేతలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో... కక్షపూరిత సోదాలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని కూడా తేల్చేశారు. ఏదో ఒక లింకులు పెట్టి సీబీఐ ద్వారా ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలను తోసిపుచ్చలేమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
వీటన్నింటి ఫలితంగా... గతంలో ఇచ్చిన ‘జనరల్ కన్సెంట్’ను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వెరసి... ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను కోరిన కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తు జరపగలదు. లేదా... న్యాయస్థానం ఆదేశాలతో అడుగు పెట్టగలదు. అంతకుమించి... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు ల అవినీతిపైనా సీబీఐ చర్యలు తీసుకోలేదు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ, సీఆర్పీసీ, ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ చట్టాల కింద సీబీఐ తనంతట తాను కేసు నమోదు చేయలేదు. మరి బాబు ఇలా నిర్ణయం తీసుకున్నాక.. రాష్ట్రంలో ఏం జరగనుంది? ఇది మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రధాన ప్రశ్న. దూకుడు మంచిదే అయినా.. ప్రస్తుతం సీబీఐని చంద్రబాబు ఓ దొంగ సంస్థగా తీల్చేశారు. నిజానికి సీబీఐని కాంగ్రెస్ వినియోగించుకున్నం తగా ఎవరూ వినియోగించుకోలేదు. కానీ, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఉన్నపళాన కేంద్ర దర్యాప్తు సంస్థను రాష్ట్రంలోనికి అడుగు పెట్టనివ్వను అని చంద్రబాబు చేసిన నిర్ణయంపై సర్వత్రా విస్మయం కూడా వెలువడుతోంది.
మరో ఆరు మాసాల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కనుక సీబీఐ రాష్ట్రంపై దృష్టి పెట్టి దాడులు చేయాల్సి వస్తే.. తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులే టార్గెట్ అవుతారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్పై జరిగిన కోడి కత్తి హత్యాయత్నం కేసును విచారించేందుకు సీబీఐ అనుమతికోరుతూ.. జగన్కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ పర్యవసానాల నేపథ్యంలో ఏదైనా తేడా వస్తే.. తమ్ముళ్లు అడ్డంగా బుక్ కాక తప్పదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారనేది విశ్లేషకుల భావన. వచ్చే ఎన్నికల్లోపే సీబీఐ కన్ను తెరిస్తే.. ఇక్కడ బాబుకు పతనం తప్పదు. ఇక, కోడి కత్తి కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో దీనిపైనా అనేక అనుమానాలు వస్తున్నాయి.
తాను అసలు కోడికత్తి ఎలా ఉంటుందో కూడా తెలియదని జగన్ కేసులో నిందితుడు శ్రీనివాస్ తాజాగా వెల్లడించడాన్ని బట్టి కేసు నీరుగారిపోతోందన్న భావన ఎదురవుతోంది. ఈ పూర్తి ఎపిసోడ్ను సీబీఐ చేపడితే.. తప్పు తన పక్షానే ఉన్నట్టు అర్ధమవుతుందని భావిస్తున్న చంద్రబాబు మొత్తానికే సీబీఐని దొంగను చేస్తూ.. ఇలా తీర్మానించారని అంటున్నారు. ఇక, ఇక్కడే మరో వాదన వినిపిస్తోంది.. రేపు కోర్టు సీబీఐని ఈ కేసులో పరిశీలించాలని సూచిస్తే.. దానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అనుమతి ఇవ్వాలి. అయితే, ఈ అనుమతి వ్యవహారాన్ని ఆలస్యం చేసే అవకాశం కూడా రాష్ట్ర ప్రబుత్వానికి ఉంటుంది. వెరసి మొత్తంగా ఈ కేసులో జగన్ కు భయపడే చంద్రబాబు ఇలా తమ్ముళ్లను తప్పించేందుకు, వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఏం చేసినా ప్రజల కోసమే అంటే.. ఇది కూడా అదే అను కోవాలా?!!