తెలంగాణలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పలువురు కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు రెండు తెలుగు రాష్రాల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందా ? అన్న ఆతృత అందరిలోనూ ఉంది. అదే క్రమంలో కొందరు కీలక నాయకులను ఓడించేందుకు ప్రత్యర్థి వేస్తోన్న ఎత్తులు సైతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్గా మారాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, మహాకూటమిలో ఎంతమంది ప్రచారం చేస్తున్నా యువనేతలుగా ఉన్న మంత్రి కేటీఆర్, టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో సవాళ్లు సైతం రువ్వుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇప్పటికే జరుగుతున్న మాటల యుద్ధం తాజాగా కేటీఆర్ కొడంగల్ పర్యటనతో మరింత రాజుకుంది.
కేటీఆర్, రేవంత్ ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థులు కాకపోయినా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో యూత్ ఐకాన్లుగా ఉన్న వీరిద్దరూ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటుండడంతో పాటు ఒకరిపై ఒకరు సవాళ్లు రువ్వుకుని ఎన్నికల ప్రచారానికి మరింత ఆకర్షణగా మారారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎలాగైనా ఓడించాలని స్కెచ్తో ఉన్న టీఆర్ఎస్ మంత్రి మహిందర్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని అక్కడ బరిలోకి దింపింది. నరేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేసిన కేటీఆర్ కొడంగల్లో హాట్ హాట్గా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ టీవీల్లో కనిపించడం తప్పా కొడంగల్కు చేసిందేమి లేదని విమర్శించారు. అదే టైమ్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
రేవంత్పై కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు రేవంత్ ఘాటైన కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తన నియోజకవర్గంలో తనను ఓడించాలని ప్రచారం చెయ్యడంతో పాటు తనపై విమర్శలు చేసిన కేటీఆర్ను టార్గెట్ చేసుకొనేందుకు ఇప్పుడు రేవంత్ కేటీఆర్ ప్రాధినిత్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటనకు రెడీ అవుతున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చెయ్యనున్నారు. ఈ నెల 24న రేవంత్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కేటీఆర్ ప్రాధినిత్యం వహిస్తున్న సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హెలీకాఫ్టర్ను సమకూర్చి మరీ రేవంత్ రెడ్డిని ప్రచారంలోకి దింపుతోంది.
ఇప్పటికే తెలంగాణలో ఫైర్బ్రాండ్ లీడర్గా గుర్తింపు ఉండడంతో పాటు యూత్ ప్రత్యేక ఐకాన్గా మారిన రేవంత్ను రంగంలోకి దింపితే సిరిసిల్లలో ఆ ఎఫెక్ట్ కేటీఆర్పై కొంతైనా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2009 ఎన్నికల్లో కేటీఆర్పై ఇండిపెండెట్గా పోటీ చేసిన న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి కేవలం 171 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2010 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరి పోటీ చేసి మళ్ళీ కేటీఆర్పై ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా కేటీఆర్తో తలపడుతున్నారు. రేవంత్ సిరిసిల్లలో కేటీఆర్ను ప్రధానంగా నేరెళ్ల ఘటన, ఇసుక అక్రమరవాణతో పాటు కేసీఆర్ కుటుంబ పాలన టార్గెట్గా చేసుకుని మాట్లాడి ఆయన్ను ఇరుకున పెట్టే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ వార్ తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది. మరి ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో ? ఎన్నికల ఫలితాలే చెపుతాయి.