ప్రపంచాన్ని గెలిచానని చెప్పుకొన్న అలెగ్జాండర్ కూడా చివరి దశలో భయపడ్డాడని చరిత్ర చెబుతోంది. ఇదే ధోరణిని కనబరుస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ అధినేతగా, ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్లు పాలించిన నాయకుడిగా ప్రస్తుతం ఏపీని నాలుగున్నరేల్లు మరో నాలుగు మాసాల్లో పూర్తి కాలం పాలించి తొలిసీఎంగా పేరు తెచ్చుకొంటున్న ఆయన ఓ కేడర్ లేని పార్టీని చూసి భయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆదిశగా మేధావులను చర్చకు పురిగొల్పాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న చిరంజీవి పార్టీని అమ్ముకుని పోతే.. అదే చేసేందుకన్నట్టుగా పవన్ వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ పవన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
నాడు తన సిధ్ధాంతాలు రైటని, నేడు తననే మొసగాడంటున్నాడని.. పవన్ ఓ ఊసరవెల్లి అంటూ జనసేనానిపై మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి, టోపీలు వేయడానికి జనసేన పార్టీ వచ్చిందన్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పీఎం మోడీని ఎదిరించి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నానని.. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎదుర్కోవడానికి తాను సిధ్ధమన్నారు. న్యాయంగా పనిచేస్తుంటే తమపై సీబీఐ దాడులు జరపడం ఎంత వరకు న్యాయమన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీని గెలిపించడానికి సిధ్ధంగా ఉండమని పిలుపునిచ్చారు.
మరోవైపు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా అన్యాయం చేస్తే చూస్తు ఊరుకోనని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి పేరు చెబుతా.. వాళ్ళను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించండన్నారు. ‘‘అన్నీ చేశాం.. చేస్తున్నాం. మళ్ళీ పార్టిని గెలిపించే హక్కు మీకు లేదా’’ అని కార్యకర్తలను ప్రశ్నించారు.
అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలూ కచ్చితంగా గెలిపించాలని పిలుపునిచ్చారు.అంతేకాదు, మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సైకిల్ తిరుగుతుందని చెప్పారు. మరి ఇంత ధీమా ఉన్నప్పుడు ఓ కేడర్ లేని నాయకుడు, తాను లేకపోతే.. జనసేన గురించి మాట్లాడే దిక్కుకూడా లేకుండా చేసుకున్న పవన్ గురించి బాబు భయపడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి బాబుకున్న ఇమేజ్ ముందు పవన్ ఇమేజ్ ఎంత? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంంది. ఈ నేపథ్యంలో బాబు ఆవేశం ఎందుకు ? అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు పెట్టుకుని అనవసరంగా పవన్ను బాబు పెద్దోణ్ని చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుండడం గమనార్హం.