తెలంగాణా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరో 9 రోజులే ఎన్నికల ప్రచారానికి గడువు ఉండడంతో నాయకు లు నువ్వా-నేనా అనే రేంజ్లో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అధికారంలోకి తిరిగి వచ్చేందుకు టీఆర్ ఎస్, కేసీఆర్ను ఓడించేందుకు మహాకూటమి నాయకులు ఇలా ఎవరికి వారు ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటూ. ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇదిలావుంటే, టీ ఎన్నికల్లో కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార టీఆర్ ఎస్ దాదాపు ఎక్కువగా సిట్టింగులకు సీట్లు కట్టబెట్టింది. ఎక్కడా కూడా పార్టోలో ఉన్న పాతకాపులకు కానీ, కొత్తవారికి కానీ అవకాశం లేకుండా పోయింది. దీంతో కొంత మేరకు అసంతృప్తి అయితే కనిపిస్తోంది.
ఇక, మహాకూటమి విషయానికి వస్తే.. దాదాపు 10 స్థానాల్లో కొత్త కోయిలలకు అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా కూకట్పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా.. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ మనవరాలు.. సుహాసిని రంగంలోకి దిగారు. ఈమె రాజకీయాలు పూర్తిగా కొత్త ఏనాడూ ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ, రాజకీయాల్లో కనిపించలేదు. దీంతో ఆమెపై అందరి చూపు పడింది. ఇక, అదేవిధంగా మహాకూటమి తరఫున భువనగిరి నుంచి అనిల్కుమార్ రెడ్డి కంభం రంగంలోకి దిగారు. ఈయనకు కూడా రాజకీయాలు కొత్తే. నిన్న మొన్నటి వరకు అస్సలు రాజకీయాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేసిందే లేదు. ఇక, ముషీరాబాద్ నుంచి అనిల్కుమార్ యాదవ్, పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి, స్టేషన్ ఘనపూర్ నుంచి ఎస్. ఇందిరా, సిర్పూరి నియోజకవర్గం నుంచి పాల్వాయ్ హరీష్ బాబు బరిలో నిలిచారు.
అదేవిధంగా.. ముథోల్ నియోజకవర్గం నుంచి రామారావ్ పటేల్ను రంగంలోకి దింపారు. చెన్నూరు నుంచి బీ వెంకటేష్, తాండూరు నుంచి పీ. రోహిత్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇక, పాతబస్తీ నుంచి కూడా ఇద్దరు కొత్తవారికే అవకాశం లభించిం ది. ఇక, అదేసమయంలో ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లు పోటీ చేస్తున్నారు. వీరంతా టీఆర్ ఎస్లో చక్రం తిప్పిన నాయకులు కావడం గమనార్హం. మరి వీరు గెలుస్తారా? లేక జూనియర్లపై ఓడిపోతారా. అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరో వారం రోజులే ఎన్నికల ప్రచారానికి గడువు ఉండడంతో నాయకులు తమలో తాము తర్జన భర్జన పడుతున్నారు. ఓడిపోతే.. జూనియర్లను కూడా గెలవలేని నాయకులనే చెడ్డపేరు ఖాయమని వీరు భావిస్తున్నారు. ఇక, కొత్తగా రంగంలోకి దిగిన నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తమ సత్తాచాటాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం.