ఓటుకు నోటు చంద్రబాబు రాజకీయ జీవితంలో ఓ కీలకమైన ఘట్టం. నేను నిప్పు అంటూ ఆయన చెప్పుకునే గొప్పలకు ఈ ఉదంతం ఓ మాయని మచ్చ. ఈ కేసులో అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు కేసీఆర్ ముందు తలవంచారని చెబుతారు. కానీ అసలు ఆ సమయంలో ఏంజరిగిందన్నది ఎవరూ బయటపెట్టలేదు.
తాజాగా.. ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు.. ఓటుకు నోటు సమయంలో ఏపీ సీఎస్ గా ఉన్నారు. ఆ సమయంలో అసలేంజరిగిందో ఆయన తన తాజా పుస్తకంలో వివరించారు. ఆయన ఏం రాశారో ఆయన మాటల్లోనే చూద్దాం..
2015 జూన్ 1వతేదీ సాయంత్రం ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి..’’ ఉదంతం ప్రసారమైంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు చంద్రబాబుది కాదన్నారు. జూన్ 2న విజయవాడలో మహాసంకల్ప దీక్షకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్, పరకాల ప్రభాకర్తో కలసి ప్రత్యేక విమానంలో వెళ్లాం. ఆ సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో నెత్తుటి చుక్క లేనట్లు కనిపించింది. ఆయన మౌనంగా ఏదో ఆలోచిస్తూ కనిపించారు. మహా సంకల్ప దీక్షలో పాల్గొన్న సీఎం పరధ్యానంగానే కనిపించారు.
.
కేంద్రం జోక్యం చేసుకోవడంతో కొంత ఘర్షణ తర్వాత ఇద్దరు సీఎంలు రాజీకి వచ్చినట్టున్నారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు చాలా బలహీనపడ్డారు. ఆయన మొదట్లో కేసీఆర్ గురించి తేలికగా మాట్లాడేవారు. 2015 జూన్ 2 తర్వాత ఇక నోరు విప్పలేదు. జూన్ 2కు ముందు చంద్రబాబు ఒక మనిషి కాగా ఆ తర్వాత ఆయన మరో మనిషిలా మారారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం, విషయాలను డీల్ చేసే విధానాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. ఈ కేసులో విచారణ వెంటనే సాగి ఉంటే సాక్ష్యాధారాలు మరింత బయటపడేవి. కానీ విచారణ ఆగిపోయింది.