ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరో సంచలనానికి తెరలేపారు. మరో మూడు రోజుల్లో తెలంగాణలో పోలింగ్ ఉండగా.. మరో ముగ్గురు విజేతల పేర్లు ప్రకటించారు. ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రకటించేశారు. ఆల్రెడీ.. నారాయణపేటలో శివకుమార్ రెడ్డి, బోథ్ లో జాదవ్ అనిల్ కుమార్ గెలుపు ఖాయమని ఆయన ప్రకటించారు. సర్వేల విషయంలో లగడపాటి రాజగోపాల్ కు మంచి విశ్వసనీయత ఉండటంతో ఆయన సర్వేపై అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన చెప్పిన ఎన్నో సర్వేలు నిజమయ్యాయి.
తాజాగా... ఆయన గెలుస్తారని చెప్పిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నుంచి బీఎస్పీ తరపున బరిలో ఉన్న మల్ రెడ్డి రంగారెడ్డి గెలుస్తారని లగడపాటి చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబెల్ గా ఉన్న మల్ రెడ్డి రంగారెడ్డి ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. ఈయన బీఎస్పీ తరపున బరిలో దిగారు. కాంగ్రెస్ లో పేరున్న నేత కావడంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు.
అలాగే.. మహబూబ్ నగర్ జిల్లా జిల్లా మక్తల్ నుంచి స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి గెలవనున్నారని చెప్పారు. అలాగే అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి బరిలో ఉన్న జి. వినోద్ కూడా విజయం సాధిస్తారని లగడపాటి వివరించారు. టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఈయన బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం ఈయన ప్రత్యేకత.