తెలంగాణలో ఎన్నికల జాతర ముగిసింది. టీఆర్ఎస్, మహాకూటమి మద్య హోరా హోరా యుద్దం కొనసాగింది. మహాకూటి తరుపు నుంచి హేమా హేమీలు ప్రచారం చేశారు. మొత్తానికి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి..టీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చిన సానుభూతి పవనాలతో టీఆర్ఎస్ కేవలం 63 స్థానాలు సాధిస్తే ఇప్పుడు ఏకంగా 88 సీట్లతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధిస్తే ప్రజాకూటమి కేవలం 21 స్థానాలకే పరిమితం అయ్యింది.
ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు, టీడీపీ 2 స్థానాల్లో గెలిస్తే ప్రజాకూటమిలో పోటీ చేసిన తెలంగాణ జనసమితి, సీపీఐ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. మొన్నటి వరకు కొడంగల్ లో దూకుడు మీద ఉన్న రేవంత్ రెడ్డి సైతం దారుణంగా ఓడిపోయారు. అయితే ఆయన శిష్యురాలు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా తన రాజకీయ గురువు, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కలిశారు.
తనకు టికెట్ ఇవ్వడమే కాదు..తన తరుపు నుంచి ప్రచారం చేసి గెలుపునకు కారణం అయిన రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లోని రేవంత్ గృహానికి తన అనుచరులతో కలసి వచ్చిన ఆమె, ఆపై మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశానని అన్నారు. హరిప్రియతో పాటు ఇల్లెందు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో తన శిష్యురాలు హరిప్రియ విజయం సాధించగా, రేవంత్ మాత్రం ఓటమి పాలైన సంగతి తెలిసిందే.