ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు ముంచుకొస్తోంది. పెథాయ్ తుపాను ఆంధ్రా కోస్తా తీరానికి చేరువైంది. ఈ తీవ్ర తుఫాన్ కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. గంటలకు 19 కిలోమీటర్ల వేగంతో ఈ తుపాన్ దూసుకొస్తోంది. పెథాయ్ పెను తుపాను తుని-యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఆర్టీజీఎస్ కేంద్రం హెచ్చరించింది.
గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో పెథాయ్ తుపాను తీరం దాటనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడుతుందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరటి రైతులు, ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వరి, జొన్న, తదితర ధాన్యాలను కోసినవారు వాటిని వెంటనే గోదాములకు తరలించాలని చెబుతున్నారు.
గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉన్న నివాసముంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆర్టీజీఎస్ జిల్లాల యంత్రాంగాలకు సూచించింది. తుపాన్ తీరం దాటే వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వాహనాల్లో తిరగవద్దని... చెట్ల కింద తలదాచుకోవద్దని చెబుతున్నారు. ప్రత్యేకించి తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జల్లాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.