వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. చివరి దశలో ఆయన పాదయాత్రకు గ్లామర్ టచ్ కూడా తోడవుతోంది. వైఎస్ జగన్ పాదయాత్రలో కొద్దిసేపు ప్రముఖ నటుడు భాను చందర్ పాల్గొనడం ఆసక్తి రేపుతోంది. జగన్ సేవాకార్యక్రమాలు చూసే వైసీపీలో చేరానని భానుచందర్ అంటున్నారు.
జగన్ పాదయాత్రలో పాల్గొన్న భాను చందర్.. జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తర్వాత ఇంత ప్రజాదరణ చూరగొన్న నేతను తాను చూడలేదని పొగడ్తలతో ముంచెత్తారు.
అంతే కాదండోయ్.. భాను చందర్ కళ్లకు జగన్ ఎలా కనిపించారో తెలుసా.. తనకు జగన్లో ప్రజల కోసం కదలి వచ్చిన బుద్ధుడులా కనిపించారన్నారు. జగన్ కు ఎంతో ఓర్పు, ఔదార్యం ఉన్నాయన్నారు భానుచందర్. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన 2019లో జగన్ సీఎం కావడం ఖాయమన్నారు.
మరి భాను చందర్ ఈ స్థాయిలో జగన్ ను పొగుడుతున్నారంటే.. పార్టీలో ఏదో పెద్దస్థాయినే ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవాలా.. లేక.. అభిమానంతోనే నాలుగు మంచి మాటలు చెబుతున్నారా.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ కూడా చేస్తారా.. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే ఇంకాస్త ఆగాలి.