కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని ఐతవరం వద్ద హైవేపై కారులో అనుమానాస్పద స్థితిలో వ్యాపారవేత్త మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీ చిగురుపాటి జయరామ్ గా గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ ఎక్స్ప్రెస్ టీవీ ఛైర్మన్గానూ కొన్నాళ్లపాటు కొనసాగారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అయితే జయరామ్ మృతికి రోడ్డు ప్రమాదమే కారణమా? లేక హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కారు వెనక సీట్లో ఆయన మృతదేహం పడి ఉండగా, డ్రైవర్ జాడ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జయరామ్ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో నివాసముంటుండగా.. ఆయన తల్లిదండ్రులు విజయవాడ కానూరులో ఉంటున్నారు.
మరోవైపు ఆర్థికపరమైన వివాదాలే ఈ ఘటనకు కారణమై ఉంటాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండ్రోజుల క్రితం జయరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరినట్లు.. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా కారులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హైవేపై టోల్గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.