జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన రామలసీమ జిల్లాల్లోంచి పోటీ చేస్తారని..కొందరు..లేదు ఉభయ గోదావరి జిల్లాలోంచి అని మరికొందరు...ఉత్తరాంధ్ర జిల్లాల్లోంచి అంటూ ఇంకొందరు..ఇలా ఆ పార్టీలోని నేతలు ఎవరికి తోచింది వారు ఆఫ్ ది రికార్డులోనే మీడియాకు లీకులు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. గతంలో ప్రజారాజ్యం గెలిచిన స్థానాల్లో ఏదైనా ఒక దాన్నుంచే బరిలోకి దిగడం శ్రేయస్కరం అన్న వాదనను ఆ పార్టీలోని కొంతమంది నేతలు పవన్కు సూచించారట. అయితే పవన్ సామాజిక వర్గం, సినీ అభిమానులు లేని స్తానం నుంచే పోటీ చేసి తన సత్తా చాటాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా తాను పోటీ చేసే నియోజకవర్గం పేరును పవన్ స్వయంగా వెల్లడిస్తే తప్ప అంతా ఊహాగానాలుగానే కొట్టి పారేయాల్సిన పరిస్థితి. అయితే గతంలో పవన్ పలుమార్లు పలు స్థానాలను ఊటంకించారు...ఒకసారేమో అన్ని కుదిరితే పిఠాపురం నుంచి చేస్తానని, మరొకసారేమో.. అనంతపురం నుంచి బరిలోకి దిగుతానని ఆయన చెప్పుకొచ్చారు. ఆమధ్య ఏలూరు పేరు కూడా వినిపించింది. అయితే.. పార్టీ అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై పార్టీలో స్ర్కీనింగ్ కమిటీ వేశారు. ఈ కమిటీ సూచించిన ప్రకారం..పవన్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని ... గాజువాక నియోజకవర్గం పవన్కు అన్ని విధాలుగా సరిపోతుందని సూచించినట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ సభ్యత్వ నమోదు కోసం చేపట్టిన మిస్డ్ కాల్ కు మంచి స్పందన వచ్చిందంట.
ఇక్కడి నుంచే ఎక్కువ మంది నమోదు అయ్యారని, అందుకే అక్కడి నుంచే పోటీచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పవన్ అభ్యర్థిత్వం విషయంలో కూడా రాజకీయ కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు అయ్యారని, ఉత్తరాంధ్ర నుంచి కాలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి దిగితే ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంటుందన్న అంచనాలను ఆ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. పవన్ జనంలోకి వచ్చిన మొదట్లో ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా పర్యటించారు. అక్కడి నుంచే తన ప్రజాపోరాటయాత్ర చేపట్టారు. అక్కడే ఎక్కువగా హడావుడి చేసిన విషయం తెలిసిందే.