నాలుగున్నరేళ్లపాటు కలిసి కాపురం చేసిన బీజేపీ – టీడీపీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణాలంటే అందరికి తెలిసిందే. అయితే బీజేపీతో కటీఫ్ చెప్పిన తర్వాత మోదీపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అసలు మోడీకి రాష్ట్రంలో అర్హతే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడి తీరు తీవ్ర ఆక్షేపణీయంగా మారుతోంది.
దేశ ప్రధాన మంత్రికి దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. అధికార పార్టీ రాష్ట్రాలైనా, కాకపోయినా ఆయన దేశానికి ప్రధాన మంత్రి. ఆయన ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నేత. అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం పౌరులుగా అందరికీ బాధ్యత ఉంటుంది. అయితే రాజకీయ కోణంలో ఆయన్ను విమర్శించడం వేరే సంగతి. అతని రాజకీయ సిద్ధాంతాలు నచ్చకపోతే వాటిని తప్పుబట్టే హక్కు కూడా అందరికీ ఉంటుంది. అయితే ప్రధాన మంత్రి హోదాలో ఓ రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం మర్యాద ఇవ్వడం కనీస బాధ్యత.
అయితే కేంద్రం నుంచి బయటికొచ్చిన తర్వాత మోదీపై భగ్గుమంటున్నారు చంద్రబాబు. ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కూటమి కడ్తున్నారు. తప్పులేదు. రాజకీయ కోణంలో ఇవన్నీ సహజమే. అయితే ప్రధానమంత్రి హోదాలో ఏపీకి వచ్చినప్పుడు మాత్రం ప్రోటోకాల్ పాటించాలి. వాస్తవానికి ఆయనకు ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రుల స్థాయి వాళ్లు స్వాగతం పలకాలి. అయితే గతంలో గుంటూరు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదు. పైగా గోబ్యాక్ మోదీ బ్యానర్లు స్వాగతం పలికాయి. అయితే పీఎంఓ జోక్యంతో వాటిని హడావుడిగా తొలగించారు.
ఇప్పుడు విశాఖకు మోదీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనహామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు లేదన్నారు. ఇప్పుడు మాత్రమే కాదు .. కొంతకాలంగా కేంద్రానికి సంబంధించిన ఏ అంశమైనా చంద్రబాబు తీరు ఇలాగే ఉంటోంది. సీబీఐ దాడులు చేసినా, ఎన్ఐఏ విచారణ జరిపినా, ఈడీ సోదాలు చేసినా, ఐటీ దాడులు చేసినా.. ఇలా ఏం చేసినా చంద్రబాబు తప్పుబడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. రాజకీయంగా ఎన్ని వైరుద్ధ్యాలున్నా హోదాకు విలువనివ్వాలి. అది జరగకపోతే ప్రజాస్వామ్య పాలనకు అర్థమే ఉండదు. ఈరోజు మోదీ ఆ స్థానంలో ఉండొచ్చు. రేపు చంద్రబాబే ఆ స్థానానికి ఎదగొచ్చు.. అప్పుడేమంటారు..? అందుకే వ్యవస్థలకు విలువ ఇవ్వండి..