ఏపీ సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో కుంభకోణాలు చేశాడని ప్రతిపక్ష నేత జగన్ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన అవినీతిపై ఏకంగా ఓ పుస్తకమే ముద్రించారు. దాన్ని అన్నిచోట్లా పంచుతున్నారు. మరి ఇదే జగన్ సీఎం అయితే చంద్రబాబును జైల్లో పెడతారా..?
ఇదే ప్రశ్న జగన్ ను నేషనల్ మీడియా అడిగింది. ఇండియా కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ను ఆ మీడియా జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగారు. మీరు చంద్రబాబును జైలుకు పంపదలుచుకున్నారా.. అని నేరుగా అడిగేశారు. అందుకు జగన్ ఏమని సమాధానంచెప్పారో చూడండి..
ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఓత్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించడమే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను, రహస్యాలను కాపాడతానని, గోప్యం పాటిస్తానని ప్రమాణం చేస్తారు. కానీ చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని భంగపరిచారు. తన కంపెనీ హెరిటేజ్ పేరుతో భూములు కొన్నారు. బినామీల పేరుతో కొన్నారు. అక్కడితో ఆగలేదు.
భూ సమీకరణ పేరుతో భూములు సేకరించారు. అలా సేకరించిన భూములను వారికి ఇష్టమొచ్చిన వారికి, వారికి ఇష్టమొచ్చిన ధరలకు ఇచ్చారు. 1600 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను తన బ్లాక్ మనీతో కొంటూ ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అయినా ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు. వాస్తవం ఏమిటన్నది మేధావులంతా ఆలోచించాలి... అంటూ సమాధానం చెప్పారు. అయితే నేరుగా చంద్రబాబును జైల్లో పెడతానని చెప్పకపోయినా.. ఈ అంశాలపై విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు జగన్.