సుదీర్ఘ కాలంగా పెండిగ్ లో ఉన్న అయోధ్య అంశానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తోంది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Image result for ayodhya case hearing

అయోధ్య అంశానికి సంబంధించిన మధ్యవర్తిత్వ బృందంలో జస్టిస్ ఇబ్రహీం ఖలీఫుల్లా (రిటైర్డ్), శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరాం పాంచూ ఉన్నారు. జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఈ టీం పనిచేస్తుంది. మరికొంతమంది సభ్యులను కూడా ఇందులో చేర్చే అవకాశముంది. ఫైజాబాద్ కేంద్రంగా ఈ కమిటీ పనిచేయనుంది. అయితే కమిటీ అధ్యయనానికి సంబంధించిన విషయాలేవీ మీడియాకు వెల్లడించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Image result for ayodhya case hearing

అయోధ్య – బాబ్రీ మసీదు అంశానికి సంబంధించి మధ్యవర్తిత్వ పరిష్కారమార్గంపై  తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. ఇది కేవలం భూవివాద పరిష్కారం కాదన్న సుప్రీంకోర్టు.. భావోద్వేగాలతో కూడిన అంశమని స్పష్టం చేసింది. అందుకే ఒకరిదిద్దరితో కాకుండా పలువురు మధ్యవర్తుల ద్వారా ఈ వివాదానికి పరిష్కారాన్ని కనుక్కొనేందుకు కృషి చేయనున్నట్టు తెలిపింది.

Image result for ayodhya case hearing

అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా, నిర్మోహి అఖాడా సమానంగా పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు 8 ఏళ్ల కిందట తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చివరకు మధ్యవర్తిత్వానికి అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. ముస్లిం సంస్థలు మాత్రం స్వాగతించాయి. దీంతో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇవాళ మధ్యవర్తిత్వానికే మొగ్గు చూపుతూ ఆదేశాలు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: