పాపం.. కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి మనసు మాత్రం మారినట్టు లేదు. ఆమె చివరకు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. పార్టీ మారవద్దని కాంగ్రెస్ పెద్దలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదు.
చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తనవంతు ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి రాయబారం కూడా పనిచేయలేదు. మొదట్లో రేవంత్ చర్చలతో కాస్త మెత్తబడ్డట్టు సబితా కనిపించారు. కానీ ఫైనల్ గా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లడం ఖాయమైపోయింది.
సబితా తనయుడు కార్తీక్కు చేవెళ్ల టికెట్ కేటాయించే అంశంపై స్పష్టమైన హామీరాకపోవడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. కొడుకు భవిష్యత్ దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆమె సన్నిహుతుల వద్ద చెబుతున్నారు. తమకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటుతో పాటు చేవేళ్ల ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై కార్తీక్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు.
ఈ అవకాశాన్ని కేసీఆర్ బాగా వినియోగించుకున్నారు. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు. కార్తీక్ రెడ్డికి కూడా కీలకమైన పదవి ఇస్తామని చెప్పారట. అన్నివిధాలుగా హామీలు దక్కడంతో సబితమ్మ చివరకు కారెక్కాలని నిర్ణయించేసుకున్నారట.